సీమ ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వ నిర్లక్ష్యం

14 May, 2017 23:31 IST|Sakshi
సీమ ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వ నిర్లక్ష్యం
- మేల్కోకపోతే రైతులకు కన్నీళ్లే
 - సీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్‌ బొజ్జా దశరథరామిరెడ్డి
ఉయ్యాలవాడ : కరువు కోరల్లో చిక్కుకున​‍్న రాయలసీమకు  నీటి వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సాగు నీటి సాధన సమితి కన్వీనర్‌ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సీమలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఆదివారం స్థానిక బస్టాండ్‌ ఆవరణలో ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ నెల 21న నంద్యాల పట్టణంలో తలపెట్టిన జలచైతన్య సభను విజయవంతం చేయాలని  కోరారు. నీటి వాటాలపై  చట్టబద్ధత కోసం పార్టీలకతీతంగా పోరాటానికి రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
 కృష్ణా జలాల పంపకాల్లో  సీమకు అన్యాయం జరిగిందన్నారు.   రాష్ట్ర విభజనతో మరుగున పడిన దుమ్మగూడెం ప్రాజెక్ట్‌  చేపడితే సీమకు 165 టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకుల స్వార్థ రాజకీయాలతో రాబోయే కాలంలో  ప్రజలు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  జల చైతన్య సభకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు ఆరికట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎన్‌రెడ్డి, ఉయ్యాలవాడ, అల్లూరు, నర్సిపల్లె గ్రామాల సర్పంచ్‌లు మిద్దెసుబ్బరాయుడు, ఆరికట్ల శివరామకృష్ణారెడ్డి, పల్లెమద్దిలేటిరెడ్డి, ఉప సర్పంచ్‌ కూలూరు రామకృష్ణారెడ్డి, దండే ఆదినారాయణరెడ్డి, ఖాతా దస్తగిరిరెడ్డి, గాండ్లశేషయ్య పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు