రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

14 Dec, 2016 02:52 IST|Sakshi

మునిపల్లి : రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాబూమోహన్‌ అన్నారు. మంగళవారం మండలంలోని కంకోల్‌ గ్రామానికి చెందిన శ్రీశైలం స్వామిని రాయికోడ్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే బాబూమోహన్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి హైదరాబాద్‌కు వెళ్లారు. బాబూమోహన్‌ వైస్‌ చైర్మన్‌ కంకోల్‌ శ్రీశైలం స్వామికి స్వీటు తినిపించారు. ఈ సందర్భంగా బాబూమోహన్‌ మాట్లాడుతూ రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు దగ్గరలో మార్కెట్‌ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 18వ తేదీన జోగిపేటలో క్రిస్మస్‌ పండుగ సందర్భంగా మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల క్రిస్టియన్లు 2 వేల మందికి బట్టలు పంపిణీ చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు పెద్దలోడి బస్వరాజ్‌ పాటీల్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌ను కోరారు. బాబూమోహన్‌ సానుకులంగా స్పందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, తాటిపల్లి సర్పంచ్‌ అల్లం నవాజ్‌రెడ్డి, కంకోల్‌ మాజీ సర్పంచ్‌ నిర్మాల షెట్టి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు