పులిచింతలపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

7 Sep, 2016 22:29 IST|Sakshi
పులిచింతలపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ
 
అరండల్‌పేట: కృష్ణా డెల్టా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిర్వాసితుల సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని, పులిచింతలలో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉంచాలని రాజ్య సభ మాజీ సభ్యుడు రైతు నాయకులు డాక్టర్‌ యలమంచిలి శివాజీ తెలిపారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో బుధవారం జిల్లా సీనియర్‌ సిటిజన్‌ హనుమంతరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. పులిచింతలపై మొదట నుంచి ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.  
 
కాంట్రాక్టర్లు,  అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవరికి వారు అందిన కాడికి వారు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు  ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం పులిచింతల గురించి మాట్లాడటం లేదని మేధావులు, రైతు సంఘాలు వాస్తవాల్ని ప్రజలకి తెలియజేసి ఉద్యమించాలని కోరారు. నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్‌ కొల్లారాజమోహన్‌ మాట్లాడుతూ కాంట్రాక్టర్ల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, నిర్వాసితుల పట్ల ఉదాసీనత చూపుతుందన్నారు. చేయవలసిన పనులు చివరలో కూడా పూర్తి చేయడం లేదన్నారు.
 
తెలంగాణ ప్రభుత్వం ముంపు గ్రామాల కోసం అడుగుతున్న మొత్తాన్ని ఇచ్చి పులిచింతలలో నీరు నిల్వ ఉంచే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. రైతు సంఘ నాయకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ పులిచింతలపై మరో రూ. 200 కోట్లు వెచ్చిస్తే కృష్ణా డెల్టా రైతులు రెండు పంటలు పండించుకోవచ్చన్నారు. పట్టిసీమకు ఇచ్చి ప్రాధాన్యత పులిచింతలకు ఇవ్వడం లేదన్నారు. సమావేశంలో రైతు నాయకులు  ఎం.రమేష్, వ్యవసాయ కూలిసంఘం నాయకులు నరసింహారావు, జొన్నలగడ్డ రామారావు, వై.ఎ.కాదరి, వెంకటప్రసాద్, కాటా సాంబశివరావు, సూరయ్యచౌదరి, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
>
మరిన్ని వార్తలు