నారాయణఖేడ్: వివాహ వేడుకల్లో పెళ్లి కొడుకు ఉంగరం మాయమైంది. దీంతో రెండు గంటల పాటు పెళ్లి తంతు ఆగింది. నారాయణఖేడ్ మండలం సత్తెగామ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లింగొండ, సంగమ్మల కూతురు భారతికి చిన్న హైదరాబాద్కు చెందిన అనిల్తో వివాహం బుధవారం సత్తెగామ గ్రామంలో నిర్వహించారు.
పురోహితుడు ఈశ్వరయ్యస్వామి వరుడికి బంగారు ఉంగరం, వధువు తాళి, మట్టెలు పల్లెంలో ఉంచి మంత్రాలు ఉచ్ఛరిస్తున్నారు. ఈ క్రమంలో మాంగల్యధారణ సమయంలో ఉంగరం కనిపించకపోవడంతో వివాహ మండపంలో చోరీ కలకలం రేగింది. రెండు గంటల పాటు పెళ్లితంతు నిల్చిపోయింది. చివరకు పెద్దలు జోక్యం చేసుకొని శుభకార్యాన్ని కానిచ్చారు. ఉంగరం ఎవరు మాయం చేశారనేది మిస్టరీగా మారింది.