గుడుంబా రహిత రాష్ట్రమే లక్ష్యం

22 Nov, 2015 00:40 IST|Sakshi
గుడుంబా రహిత రాష్ట్రమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: గుడుంబాను రాష్ట్రం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చేసిన దాడులు సత్ఫలితాలు ఇవ్వడంతో గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ‘గుడుంబా ఫ్రీ’ పేరిట చేపట్టే ఈ ప్రచార కార్యక్రమాలను ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు జరిగే ఈ ప్రచార ఉద్యమం ద్వారా గుడుంబా రహిత గ్రామాలు, మండలాలను ప్రకటిస్తారు.

ఒక జిల్లాలో పూర్తిస్థాయిలో గుడుంబా లేదని రూఢీ చేస్తూ కలెక్టర్, ఎస్పీ డిక్లరేషన్ ఇస్తే దాన్ని గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించి ఉత్సవాలు జరుపుతారు. తొలుత గుడుంబాను 95 శాతం మేర నిషేధించిన గ్రామాలు, మండలాలను స్థానిక తహసీల్దార్, ఎస్‌ఐల ఆమోదంతో ప్రకటించి, సభలను నిర్వహిస్తారు, తరువాత జిల్లా స్థాయిలో సంబరాలు జరుపుతారు. గుడుంబాకు వ్యతిరేకంగా ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 10 వరకు చేపట్టే కార్యక్రమాల వివరాలను ఎక్సైజ్ డెరైక్టర్ అకున్ సబర్వాల్‌కు అధికారులు ఇప్పటికే పంపించారు.
మరిన్ని వార్తలు