సరుకుల రవాణాకు రాచబాట!

22 Jul, 2016 00:31 IST|Sakshi
రైలు నుంచి దిగిన గుట్కాలు, బట్టలు మూటలు
– తిలారు రైల్వేస్టేషన్‌ కేంద్రంగా పేట్రేగిపోతున్న వ్యాపారులు
– విచ్చలవిడిగా గుట్కాలు, బట్టలు దిగుమతి
– భారీ మొత్తంలో పన్ను ఎగవేత
–వాణిజ్య శాఖాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు
 
తిలారు రైల్వే స్టేషన్‌ కేంద్రంగా సరుకుల రవాణా దర్జాగా సాగుతోందనే విమర్శలు  వస్తున్నాయి. మూటల ముసుగులో గుట్కాలు, ఖైనీలు, బట్టలు, కంచు, ఇత్తడి పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. ప్రభుత్వ ఖజనాకు రూపాయి కూడా చెల్లించకుండా వ్యాపారులు ఈ స్టేషన్‌ నుంచి దర్జాగా సరుకులను దిగిమతి చేసుకొని దొంగమార్గాన కావాల్సిన చోటుకు చేర్చుకుంటున్నారు. అక్రమంగా సరుకుల రవాణా ఎంతలా జరుగుతోందో బుధవారం రాత్రి పోలీసులకు పట్టుబడిన ఖైనీలు, గుట్కాలు, నరసన్నపేటలోఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫ్యాన్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారీగా.. వేళాపాళా లేకుండా చీకటి వ్యవహారం జరుగుతున్నా వాణిజ్య పన్నులశాఖాధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
 
 
జలుమూరు: జిల్లా కేంద్రం శ్రీకాకుళం తరువాత భారీగా వ్యాపారం జరిగేది నరసన్నపేట ప్రాంతంలోనే. బంగారం నుంచి స్టీల్, సిమెంట్, గ్రానైట్, బట్టలు, నిషేధిత గుట్కాల వ్యాపారం ఇక్కడ కోట్లాది రూపాయల్లో జరుగుతోంది. ఇక్కడకు సరుకులు చేరేందుకు తిలారు రైల్వేస్టేషన్‌ అతి సమీపంలో ఉండడంతో వ్యాపారులకు కలిసి వస్తోంది. ఎలాంటి పన్నులను చెల్లించకుండానే సరుకులను దర్జాగా ఇక్కడకు చేర్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
 
అక్రమంగా దిగుమతులు
 
వ్యాపారులు దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి అనేక వస్తువులను రైళ్ల ద్వారా తీసుకొని వస్తుంటారు. విలువ ఆధారిత,(వ్యాట్‌) ఎక్సైజ్‌ సుంకం, కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్‌డీటీ) తదితర పన్నులు, సుంకాలు చెల్లించాల్సి ఉండగా.. వ్యాపారులు వీటిని దర్జాగా ఎగ్గొట్టేస్తున్నారు. ఎక్కువగా ఒడిశా వైపు నుంచి వచ్చే రైళ్ల ద్వారా తిలారు స్టేషన్‌కు సరుకులను వ్యాపారులు దిగిమతి చేసుకుంటుంటారు. ఈ స్టేషన్‌ వద్ద ఎలాంటి తనిఖీలు అధికారులు చేపట్టకపోవడం వ్యాపారులకు కలిసి వస్తోంది.
 
సరుకుల తరలింపు ఇలా
 
సరుకుల రవాణా వెనుక భారీ నెట్‌ వర్క్‌ నడుస్తోంది. తమిళనాడు, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, కోల్‌కత్తా, ఒడిశాలో ఉన్న దళారుల నుంచి తిలారు స్టేషన్‌ వరకు సరుకులు చేరేలా కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు. తిలారుకు చేరిన కంచు, ఇత్తడి, గుట్కాలు, బట్టలు, ఇతర విలువై సరుకులను వేర్వేరు ప్రాంతాల్లోని స్టాక్‌ పాయింట్లకు ముందుగా వ్యాపారులు చేర్చుతారు. బుడితి, సారవకోట వెళ్లాలంటే జోనంకి, కృష్ణాపురం మీదుగా అడ్డదారిలో సరుకులను చేర వేస్తారు. నరసన్నపేటకు తరలించేందుకు తిలారు స్టేషన్‌ వెనుక భాగంలో.. ఎఫ్‌సీ గొడౌన్‌ నుంచి రావిపాడు, ఏనేటి కొత్తూరు మీదుగా తరలిస్తారు. టెక్కలి, కోటబొమ్మాళి తీసుకెళ్లేందుకు రావిపాడు, తుంబయ్యపేట, రామినాయడుపేట గ్రామాలు మీదుగా కొందరు, నిమ్మాడ మీదుగా మరికొంత మంది సరుకులను అధికారుల కంట పడకుండా ఆటోల్లో తరలించుకుపోతున్నారు. సరుకులను తరలించే ముందు కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వెళ్లి ఎవరూ లేరని నిర్థారించుకుంటారు. ఈ విషయాన్ని సెల్‌ ఫోన్ల ద్వారా సమాచారం చేరవేసి సరుకులను గమ్యస్థానానికి చేర్చుతారు.
 
పట్టించుకోని రైల్వే సిబ్బంది
 
 రైళ్ల నుంచి సరుకులు దిగితున్నా స్టేషభ్‌ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. సరుకులకు ఉన్న రశీదులు మాత్రమే చూస్తామని, అందులో ఏం ఉన్నాయో చూసే బాధ్యత తమది కాదని సంబంధిత సిబ్బంది చెప్పి తప్పించుకుంటున్నారు.
 
డీసీటీవో ఏమన్నారంటే..
అక్రమంగా సరుకులు దిగిమతి చేసుకుంటున్న విషయాన్ని నరసన్నపేట డిప్యూటీ  సీటీవో యూ.కేశవరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. ఎప్పకప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరైనా పట్టుబడితే కేసులు నమోదు చేయడంతోపాటు, అపరాధ రుసుం విధిస్తున్నామన్నారు.
 
>
మరిన్ని వార్తలు