అధికార లాంఛనాలతో హంపన్న అంత్యక్రియలు

3 Jan, 2017 23:37 IST|Sakshi
అధికార లాంఛనాలతో హంపన్న అంత్యక్రియలు

కళ్యాణదుర్గం : పట్టణంలోని శంకరప్పతోట కాలనీకి చెందిన స్పెషల్‌పార్టీ పోలీసుకానిస్టేబుల్‌ హంపన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మంగళవారం నిర్వహించారు. సీఎం బందోబస్తు విధుల్లో తుపాకీ పేలి హంపన్న చనిపోయిన విషయం విదితమే. భౌతికకాయాన్ని పోలీసు అధికారులు కళ్యాణదుర్గం తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న స్నేహితులు వందలాది ద్విచక్ర వాహనాల్లో అనంతపురం రహదారికి ఎదురేగి పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు.

‘హంపన్న అమర్‌ రహే’ అంటూ నినాదాలు చేశారు. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీ సంఖ్యలో హంపన్న ఇంటి వద్దకు తరలివచ్చారు. భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రులు మారెక్క, నారాయణప్ప, సోదరుడు లక్ష్మణమూర్తి, ఇతర బంధువుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, మున్సిపల్‌ చైర్మన్‌ వై.పి.రమేష్‌లు హంపన్నకు నివాళులర్పించారు. అనంతరం పట్టణ సమీపంలోని సొంత వ్యవసాయ తోటలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సీఐ చలపతి రావు, ఎస్‌ఐ నబీరసూల్, పోలీసు సిబ్బంది అధికార వందనం స్వీకరించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు