కాకినాడ సిటీ: రేషన్ లబ్ధిదారుల పది మంది చేతివేలిముద్రలు ఇంటింటికీ వెళ్ళి సేకరించే బెస్ట్ఫింగర్ డిటెక్షన్(బీఎఫ్డీ) ప్రక్రియను చేపట్టినట్టు పౌర సరఫరాలశాఖ అధికారి జి.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. కలెక్టర్ అరుణ్కుమార్ ఆదేశాల మేరకు ఇంటింటికీ వెళ్లి వేలిముద్రలు సేకరించాలని చౌకడిపో డీలర్లకు ఆదేశాలు జారీ చేశారన్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల మంది రేషన్కార్డులకు సంబంధించి 40,20,904 మంది లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ 17,63,671 మంది వేలిముద్రలను సేకరించినట్టు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రక్రియను నిర్వహించి తిరిగి ఆగస్టు 10 నుంచి 30 వరకు చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా ఆగస్టు నుంచి పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకానికి సంబంధించి బియ్యం చౌక దుకాణాలలోని ఈ పోస్ మెషీన్ల ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని 4,309 పాఠశాలలకు సంబంధించి 926 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నామన్నారు.