తనకల్లు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అప్పగించాలని మండలంలోని బాబేనాయక్తండాకు చెందిన దేవేంద్రనాయక్ కోరాడు. మండల కేంద్రమైన తనకల్లులో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో తన పెళ్లి గురించి వివరాలను తెలిపాడు. గ్రామానికి చెందిన దేవేంద్రనాయక్ కదిరి పట్టణంలోని ఓ బేకరిలో మూడేళ్లుగా పనిచేసేవాడు. అక్కడ ప్రీతి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విషయాన్ని పెద్దలకు తెలపగా.. వారు పెళ్లికి నిరాకరించడంతో మే 15న మదనపల్లిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
అనంతరం అక్కడే ఓ గుడిలో హిందు సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కదిరి వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉండడంతో.. వారు పోలీస్స్టేషన్ వివాహం అనంతరం స్టేషన్కు వెళారు. ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నానని, భర్తే కావాలని అమ్మాయి చెప్పడంతో పోలీసులు వారిని పంపించి వేశారు. అయితే ఈ నెల 1న అమ్మాయి తల్లిదండ్రులు, అన్న, మరికొందరు బంధువులు మారణాయుధాలతో వచ్చి దాడి చేసి.. భార్యను బలవంతంగా తీసుకెళ్లారని అతడు వాపోయాడు. వారిపై చర్యలు తీసుకుని, భార్యను అప్పగించి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం తమ పెళ్లి ఫొటోలను విలేకరులకు అందజేశాడు.