హత్నూర పీఎస్‌ భేష్‌

10 Sep, 2016 18:09 IST|Sakshi
రికార్డులు పరిశీలిస్తున్న డీఐజీ
  • ప్రశంసించిన డీఐజీ.. సిబ్బంది సమస్యలు తెలుసుకున్న ఉన్నతాధికారి
  • హత్నూర: స్థానిక పోలీస్టేషన్ పని తీరుతోపాటు రికార్డు నిర్వహణ భేష్‌గా ఉందని డీఐజీ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. శనివారం పోలీస్టేషన్‌ను ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి డీఐజీ పరిశీలించారు. స్టేషన్‌కు ఆయన స్థానిక ఎస్సై బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు.

    అనంతరం పోలీసు సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఏడుగురు కానిస్టేబుళ్లను వ్యక్తిగతంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరేడ్‌ భేష్‌గా చేశారంటూ ప్రశంసిస్తూ రివార్డులను ప్రకటించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన గార్డెన్‌ను పరిశీలించి పోలీస్టేషన్‌ ప్రశాంత నిలయంగా ఉందన్నారు.

    అనంతరం  మొక్కలునాటిన డీఐజీ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. పోలీస్టేషన్‌ రికార్డులను పరిశీలించడంతోపాటు నిర్వహణ తీరు బాగుందన్నారు. రికార్డులు ప్రతి ఒక్కటి సక్రమంగా ఉన్నాయని అభినందించారు. స్టేషన్‌లో రికార్డులు, సీడీ ఫైల్స్‌  చక్కగా నిర్వహించినందుకు ఏఎస్‌ఐ సుదర్శన్‌, హెడ్‌కానిస్టేబుల్‌ జగదీశ్వర్లకు, కానిస్టేబుల్‌ సికిందర్‌, శ్రీరాములు, భూపాల్‌లకు రివార్డు ప్రకటించి అభినందించారు.

    కానిస్టేబుల్‌ బాల్‌రాజ్‌, హోంగార్డు మల్లేశంగౌడ్‌ల పనితీరుపై రివార్డు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎస్సై బాల్‌రెడ్డి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. బొల్లారం పోలీస్టేషన్‌ను రెండు నెలల క్రితం పరిశీలించిన సమయంలో ఎస్సైగా పని చేసిన ప్రశాంత్‌ను సైతం ఆయన అభినందించారు. డీఐజీతోపాటు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి , కరీంనగర్ ఓస్డీ  రోహినిప్రియదర్శిని, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ తిరుపతిరాజు, ఎస్సై బాల్‌రెడ్డి, శిక్షణ ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు