రోడ్డు ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

4 Mar, 2017 23:51 IST|Sakshi
 
కర్నూలు:  గోనెగండ్ల పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నీలకంఠప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదే మండలం గంజిహల్లి గ్రామంలో జరిగిన ఉరుసు బందోబస్తు విధులు ముగించుకుని శనివారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో అదుపుతప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలకు ఎదురుగా ఉన్న ఎస్‌జీఆర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆకే రవికృష్ణ హాస్పిటల్‌కు చేరుకుని నీలకంఠప్ప ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
 
అతనికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. రాత్రి 7 గంటల సమయంలో కోలుకోలేక ఆయన మృతిచెందారు. డీఎస్పీలు రమణమూర్తి, కొల్లి శ్రీనివాసరావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. నీలకంఠప్ప మృతి వార్త తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. 1983లో ఈయన పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఈయనకు భార్యతో పాటు ముగ్గురు సంతానం. సర్వీసు మొత్తం ఆదోని సబ్‌ డివిజన్‌లోనే విధులు నిర్వహించారు.    
 
మరిన్ని వార్తలు