ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం

3 Oct, 2016 21:50 IST|Sakshi
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
  • రాజపూడి పీహెచ్‌సీ ప్రారంభోత్సవంలో మంత్రి కామినేని 
  • జగ్గంపేట : 
    రాష్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని రాజపూడి గ్రామంలో రూ.78.15 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఉచిత వైద్య పరీక్షల కేంద్రాల ద్వారా రాష్ట్రంలో సుమారు కోటి మంది పరీక్షలను చేయించుకున్నారన్నారు. మాతాశిశుమరణాలు చోటు చేసుకుంటుండడంతో 16వేల మందికి ట్యాబ్‌లు అందించి ఆన్‌లైన్‌లో తల్లీబిడ్డల సమాచారం నిక్షిప్తం చేస్తున్నామన్నారు. తద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఆస్పత్రులలో కాన్పు తరువాత ఎన్టీఆర్‌ బేబీ కిట్‌లను అందజేస్తున్నామన్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసం పీహెచ్‌సీలలో 19, సీహెచ్‌సీలలో 40, రాజమహేంద్రవరం వంటి ఆస్పత్రులలో 63 పరీక్షల వరకు నిర్వహిస్తున్నామన్నారు. డెలివరీకి ముందు నాలుగు సార్లు పరీక్షలతో పాటు అల్ట్రా సౌండ్‌ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారోగ్యం కోసం పట్టణాలలో 222 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కొత్తగా 1400 మంది డాక్టర్లను తీసుకున్నామని, ఇంకా 500 మందిని నియమిస్తామన్నారు. 108వాహనాలు కొత్తవి తీసుకుంటున్నామని, 104 వాహన సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అనంతరం జగ్గంపేట సీహెచ్‌సీని సందర్శించి రోగుల వివరాలడిగి తెలుసుకున్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాజపూడి పీహెచ్‌సీలో 11మంది సిబ్బందిని నియమించామన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ రాజపూడి, చుట్టు పక్కల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. డీఎం అండ్‌హెచ్‌ఓ కె.చంద్రయ్య మాట్లాడుతూ ఈ పీహెచ్‌సీ రాజపూడి, మన్యంవారిపాలెం, జె.కొత్తూరు, వెంగాయ్యమ్మపురం, మల్లిసాల తదితర గ్రామాల పరిధిలో 25వేల మందికి అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జెడ్పీటీసీ సభ్యులు జ్యోతుల నవీన్‌కుమార్, పాలూరి బోస్, వీరంరెడ్డి కాశీ, ఎంపీపీలు గుడేల రాణి, కంచుమర్తి రామలక్ష్మి, హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌ కందుల కొండయ్యదొర, కోర్పు లచ్చయ్యదొర, సర్పంచ్‌ నంగన సత్యనారాయణ, అత్తులూరి సాయిబాబు, ఎస్‌వీఎస్‌ అప్పలరాజు, కొత్త కొండబాబు, బీజేపీ నాయకులు సూర్యనారాయణరాజు, వత్సవాయి వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు.   
మరిన్ని వార్తలు