సెంట్రో షోరూంలో భారీ అగ్నిప్రమాదం

6 Aug, 2016 23:46 IST|Sakshi
సెంట్రో షోరూంలో భారీ అగ్నిప్రమాదం

చందానగర్‌: ప్రధాన రహదారి పక్కన ఉన్న సెంట్రో చెప్పుల షోరూమ్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ. 6 కోట్ల ఆస్తినష్టం జరిగింది. వివరాలు... ఉదయం 10.30కి చందానగర్‌లోని సెంట్రో షోరూమ్‌ను తెరిచేందుకు సిబ్బంది రాగా.. లోపలి నుంచి పొగ వస్తోంది.  వెంటనే వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే మంటలు చెలరేగి షోరూమ్‌ మొత్తం వ్యాపించాయి.  అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లు, ఒక క్రేన్‌ ఫైర్‌ ఇంజిన్‌తో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.  అయితే, షోరూమ్‌ ముందు 33 కేవీ విద్యుత్‌ వైర్లు ఉండటంతో సరఫరా నిలిపేందుకు సమయం పట్టడంతో క్రేన్‌ను షోరూమ్‌ ముందుకు చేర్చేందుకు ఆలస్యమైంది. తర్వాత క్రేన్‌ సహాయంతో మూడో ఫ్లోర్‌లోని అద్దాలు పగులగొట్టి నీటిని చిమ్మారు. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటలకు మంటలను పూర్తిగా ఆర్పేశారు.

దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి...
ఏప్రిల్‌ 17న షోరూమ్‌ను ప్రారంభించిన తాము పెద్ద మొత్తంలో వస్త్రాలు, చెప్పులు, ఖరీదైన బ్రాండ్‌ షూలు తెచ్చి నిల్వ చేశామని షోరూమ్‌ యజమానులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్ల విలువైన సరుకు కాలిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో లెదర్, ఫ్లాస్టిక్, కాటన్‌ ఉత్పత్తులు కాలి దట్టమైన పొగ రావడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. ఘటనా స్థలానికి నాలుగు ఫైర్‌ ఇంజిన్లు రావడంతో ఆ మార్గంలో చందానగర్‌ వరకూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో సీఐ తిరుపతిరావు, ట్రాఫిక్‌ సీఐ వాసు దగ్గరుండి ట్రాఫిక్‌ను నియంత్రించారు.  వెస్ట్‌ జోన్‌ కమిషనర్‌ గంగాధర్‌రెడ్డి, ఉప కమిషనర్‌ మమత, కార్పొరేటర్లు బొబ్బ నవతారెడ్డి, జగదీశ్వర్‌గౌడ్  పరిశీలించారు.∙ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న భవనం అగ్నిప్రమాదంలో కాలిపోయిందని భవన యాజమానులు రాధాకృష్ణ, శ్రీకాంత్, ప్రసాద్‌ కన్నీరుపెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు