ఒంగోలు : చీరాల మండలం ఈపూరుపాలెం పంచాయతీ పురుగులపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయులు డీసీఆర్ మోహన్రాజును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డీవీ సుప్రకాశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చీరాల మండలం ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న డీఆర్డీఏ పీడీఎంఎస్ మురళి ఇటీవల ఆ పాఠశాలను సందర్శించాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎం రెండు రోజులుగా పాఠశాలకు రాకపోవడం, కనీసం సెలవు ఉత్తర్వులు కూడా లేకపోవడం, ఎంఈఓ.. ఎంఆర్సీకి గానీ తెలపలేదని డీఆర్డీఏ పీడీ గుర్తించారన్నారు.
అంతే కాకుండా మరుగుదొడ్లు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం, మధ్యాహ్న భోజనం నిర్వహణ సరిగాలేకపోవడం, బయట వ్యక్తుల వస్తువులు పాఠశాల గదిలో ఉంచుకోవడం పలు సమస్యలకు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు సరైన కారణాలు చెప్పలేకపోవడంతో తనకు ఫిర్యాదు చేశారని డీఈఓ వివరించారు. ఈ ఫిర్యాదుపై చీరాల ఎంఈఓ రిపోర్టు ఆధారంగా మోహన్రాజును సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ సుప్రకాశ్ తెలిపారు.