పిల్లలను గమనిస్తుండడండి
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
హోమ్ మంత్రి చినరాజప్ప
రాజమహేంద్రవరం క్రైం : నేరాలకు పాల్పాడే వారిలో విద్యార్థులు, యువకులే ఎక్కువగా ఉంటున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో శనివారం క్రైం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ్యతాయుతంగా పెంచడంతో పాటు వారిని గమనిస్తూ ఉండాలన్నారు. గతేడాదితో పోలిస్తే అర్భన్ జిల్లాలో క్రైం రేటు తగ్గిందన్నారు. హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారా ఘటనలు 2014 నుంచి తగుతూ ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి 50 కిలో మీటర్లకు ఒక వాహనం అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. చోరీలు, చైన్స్నాచింగ్స్ వంటి నేరాలు నివారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా రౌడీయిజం చేస్తే అణచివేయాలని ఆదేశించామన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టేందుకు షీ టీమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల జరుగుతున్న సీఐల బదిలీలలో సొమ్ములు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్లేడ్ బ్యాచ్లను అదుపులోకి తీసుకున్నారన్నారు. 250 మంది అర్భన్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నామని హోమ్ మంత్రి తెలిపారు. అర్భన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పాల్గొన్నారు.