మహిళను దూషించిన కేసులో హోంగార్డ్‌ రిమాండ్‌

22 Sep, 2016 00:54 IST|Sakshi
రఘునాథపల్లి : తాగిన మైకంలో ఓ మహిళను దూషించిన ఘటనలో హోంగార్డ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రంజిత్‌రావు బుధవారం తెలిపారు. మండలంలోని మేకలగట్టు శివారు ఆంధ్రతండాకు చెందిన గుగులోతు సరోజకు అదే తండాకు చెందిన హోంగార్డ్‌ గుగులోతు బాలాజీ మధ్య కొనాళ్లుగా వివాదం కొనసాగుతోంది. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం శ్రమశక్తి సంఘాలతో నిర్వహించిన సమావేశంలో సరోజన పాల్గొంది. తాగిన మైకంలో ఉన్న బాలాజీ మండల పరిషత్‌ కార్యాలయం సమావేశ మందిరం వద్దకు వచ్చి ఫీల్డ్‌అసిస్టెంట్‌ శంకర్‌తో సరోజనను సమావేశానికి ఎందుకు తీసుకొచ్చావని వాగ్వాదానికి దిగాడు.  అంతేగాక ఏపీఓ ప్రేమయ్యతో దురుసుగా ప్రవర్తించాడు. సరోజన భర్త పేరు తన పేరుగా ఎందుకు నమోదు చేసుకుందని రభస చేశాడు. అంతేగాక ఆమెను దుర్భాషలాడుతుండగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.   
మరిన్ని వార్తలు