కుళ్లిన గుడ్లు ఎలా తింటాం?

13 Sep, 2017 23:45 IST|Sakshi
కుళ్లిన గుడ్లు ఎలా తింటాం?
-  ‘మధ్యాహ్నం’లో లోపించిన పౌష్టికాహారం
-  కుళ్లిన గుడ్లు తినలేక తల్లడిల్లుతున్న విద్యార్థులు 
-  ‘పల్లెపిలుపు’లో అధికారులకు ఫిర్యాదు
 
చాగలమర్రి : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంలో పౌష్టికాహారం అందక విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. ఏ మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. విద్యార్ధులకు పంపిణీ చేస్తున్న కోడి గుడ్లు కుళ్లిపోయి వాసన కొడుతున్నాయి. మండలంలోని ప్రభుత్వ  ప్రాథమిక పాఠశాల్లో 2,630, ప్రాథమికోన్నత పాఠశాల్లో 1,670, ఉన్నత పాఠశాలల్లో 1020 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుటున్నారు. పాఠశాలలకు గుడ్లను పంపిణీ చేసేందుకు చక్రవర్తుల పల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కాంట్రాక్ట్‌ అప్పగించారు. ఈ కాంట్రాక్టర్‌ బళ్లారి నుంచి గుడ్లు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.
 
ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు వారానికి 3 కోడి గుడ్ల చోప్పున పంపిణీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన నెలకు లక్ష గుడ్లు సరఫరా చేస్తున్నారు. చిన్నవంగలి ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పంపిణీ చేసిన కొడి గుడ్లు కుళ్లిపోయి దుర్వాసన కొడుతుండడంతో విద్యార్థులు ఆందోళకు దిగారు. పాఠశాలో 430 మంది విద్యార్థులు మధ్యాహ్నభోజన పథకం వినియోగించుకుంటున్నారు. కోడి గుడ్లు కుళ్లి పోయి ఉండడంతో వాటిని తినలేక పారావేశారు. ‘రెండు వారాలుగా ఇలాంటి గుడ్లె పెడుతున్నారు. ఎలా తినేది’ అంటూ విద్యార్థులు ఆందోళకు దిగారు. విద్యార్థులంతా గ్రామంలో జరిగే పల్లె పిలుపు కార్యక్రమం వద్దకు చేరుకొని కుళ్లిన గుడ్లను మండల అధికారులకు చూపించారు. రెండు వారాలుగా ఇదే పరిస్థితి ఉందని, గుడ్లు తినలేక పారవేస్తున్నామని తహసీల్దార్‌ మాలకొండయ్యకు ఫిర్యాదు చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్‌ విద్యార్థులకు నచ్చజెప్పారు.
 
వచ్చిన వాటినే సరఫరా చేస్తున్నాం 
బళ్లారి నుంచి వచ్చిన గుడ్లను అన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నాం. ఒక్కో గుడ్డుకు కేవలం 15 పైసలు కమీషన్‌ మాత్రమే మాకు వస్తుంది. పై నుంచి వచ్చిన గుడ్లను అలాగే సరఫరా చేస్తున్నాం. గుడ్లు కుళ్లిపోతున్నాయని బళ్లారి లోని కాంట్రాక్టర్‌కు చెప్పాం. దానా లోపం వల్ల గుడ్లు ఇలా అవుతున్నాయని, మలివిడతలో అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు.
- అనిల్‌కుమార్‌ (కాంట్రాక్టర్‌)
మరిన్ని వార్తలు