కర్నూలు(అగ్రికల్చర్): ఎలాంటి ఆక్షేపణలు లేని ప్రభుత్వ భూముల్లో అక్రమణలో ఉన్న నివాస సముదాయాలను 100 చదరపు గజాల వరకు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు లోబడి అర్హులైన వారు మీసేవ కేంద్రాల ద్వారా తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014 జనవరి1కి ముందు జరిగిన ఆక్షేపణలు లేని నివాస గృహ సముదాయాలను మాత్రమే క్రమబద్ధీకరించబడుతుందన్నారు. దరఖాస్తులను ఆర్డీఓ ఆధ్వర్యంలోని కమిటీ విచారణ జరిపి నిర్ధారిస్తుందని డీఆర్ఓ తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.