మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..

3 Aug, 2016 19:06 IST|Sakshi

మద్యానికి బానిసైన ఓ భర్త డబ్బుల కోసం కమ్మలు ఇవ్వలేదన్న అక్కసుతో భార్యను చంపిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ జానకిరెడ్డి కథనం ప్రకారం...రంగారెడ్డిజిల్లా పూడూరుకు చెందిన ఆకుల ప్రభాకర్‌తో షాబాద్ మండలానికి చెందిన యశోద(32)తో పదహేను సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

 

వీరిరువురు మల్కాజిగిరి వీణాపాణినగర్‌లో నివాసముంటున్నారు. యశోద తమ్ముడు నరేష్ అక్కకు తోడుగా ఉంటూ స్ధానికంగా బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. క్యాటరింగ్ పనిచేసే ప్రభాకర్ తరచూ బయటకు వెళ్లి నెలల తరబడి ఇంటికి వచ్చేవాడు కాదు. తాగుడుకు బానిసైన ప్రభాకర్ తరచూ భార్యను వేధించేవాడు. మంగళవారం అర్ధరాత్రి దాటాక చిత్తూరుకు వెళ్లిన ప్రభాకర్ ఇంటికి వచ్చి భార్యతో మద్యానికి డబ్బులు ఇవ్వమని గొడవపడ్డాడు. ఆమె కమ్మలు ఇస్తే అమ్ముకుని వచ్చిన డబ్బులతో మధ్యం తాగుతానని గొడవ పడడంతో ప్రతిఘటించిన యశోదను గొంతు నులిపి హత్య చేశాడు.

 

అనంతరం ఏమి తెలియనట్లుగా బావమరిది దుకాణానికి వెళ్లి మీ అక్క చనిపోయిందని చెప్పడంతో నరేష్ బంధువులకు సమాచారం అందించి ఈ సంఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరచూ అక్కను బావ వేదించేవాడని తన అక్క చావుకు అతనే కారణమని నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గొంతు మీద కొన్ని గుర్తులు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదిక అందింతే పూర్తి వివరాలు తెలుస్తాయని, నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ జానకిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు