భార్యను రూ. 60 వేలకు అమ్మేశాడు..

13 Aug, 2015 08:46 IST|Sakshi
భార్యను రూ. 60 వేలకు అమ్మేశాడు..

* కొన్న వ్యక్తి మరొకరికి విక్రయం
* విచారణ జరుపుతున్న పోలీసులు
* నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన


ఎడపల్లి: కట్టుకున్న భార్యను అంగట్లో సరుకుగా మార్చి కట్టుకున్న భర్త  ఒకరికి అమ్మగా.. కొనుగోలు చేసిన వ్యక్తి తర్వాత మరొకరికి విక్రయించిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. జానకంపేట గ్రామానికి చెందిన  దాసరా మారుతాకు ఆర్మూర్‌కు చెందిన రాజుతో 2006లో వివాహమైంది.

వారికి ఇద్దరు ఆడపిల్లలు రమ్య, నవ్యమీనా ఉన్నారు. అయితే, రాజు తన భార్య మారుతా ను ఏడాది క్రితం బాన్సువాడకు చెందిన మల్లయ్యకు రూ. 60 వేలకు విక్రయించాడు. తర్వాత తన సొంత అక్క కూతురిని మెదక్ జిల్లాకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అక్కడే తన ఇద్దరు పిల్లలతో కాపురం పెట్టాడు. రాజు ప్రవర్తన నచ్చకపోవడంతో అక్క కూతురు రాజును విడిచి వెళ్లింది. కొన్ని రోజుల పాటు పిల్లలతో అక్కడే ఉన్న రాజు బుధవారం మారుతా సొంత గ్రామమైన జానకంపేటకు వచ్చాడు.

అక్కడ ఇళ్లకూల్చివేత కార్యక్రమం జరుగుతుండగా, ఇద్దరు పిల్లలను.. మారుతా రాసిన లేఖను సర్పంచ్ గదిలో వదిలి వెళ్లిపోయాడు. అయితే, మారుతా తల్లిదండ్రులు పిల్లలను గుర్తుపట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టగా.. ఆమెను కొనుగోలు చేసిన మల్లయ్య రూ. 50 వేలకు ఆమెను మరో వ్యక్తికి విక్రయించినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు