దంపతుల ఆత్మహత్యాయత్నం: భర్త మృతి

16 Aug, 2015 19:44 IST|Sakshi

భువనగిరి (నల్లగొండ): భర్త ఆత్మహత్య చేసుకోవడం చూసి మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలోని తాతానగర్‌లో జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన జట్కా పూర్ణచందర్ (27) స్థానిక ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఈ మధ్యనే పట్టణానికి చెందిన కీర్తి (22) తో వివాహమైంది. పూర్ణచందర్‌కు ఆదివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో భార్య పక్క గదిలో ఉన్న సమయంలో బెడ్‌రూంలోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెడ్‌రూంలోకి వెళ్లిన భర్త ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. కిటికి తెరచి చూసిన భార్య భర్త ఫ్యాన్‌కు వేలాడుతుండటంతో.. ఆవేదనకు గురై ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు నిప్పంటించుకోకుండా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే కీర్తి కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు