భార్యను కడతేర్చాడు

14 Jul, 2016 03:59 IST|Sakshi
భార్యను కడతేర్చాడు

అనుమానమే కారణం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

 కడప అర్బన్ : అతనికి కట్టుకున్న భార్యపై అనుమానం మొదలైంది. అదికాస్తా ముదిరింది. చివరకు ఆమెను కర్కశంగా మచ్చుకత్తితో నరికి చంపాడు. కడప నగర శివార్లలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి శ్రీరాం నగర్‌లో నివసిస్తున్న చిన్నాయపల్లె గంగాదేవి(29)ని, భర్త నారాయణ మచ్చుకత్తితో దారుణంగా హత్య చేసిన  సంఘటన నగరంలో సంచలనం కల్గించింది. ఈ సంఘటనకు సంబంధించి రిమ్స్ పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగుంట్లకు చెందిన గంగాదేవికి, పెండ్లిమర్రి మండలం పైడికాల్వకు చెందిన నారాయణ కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది.

వీరికి సంధ్యారాణి (4) అనే కుమార్తె ఉంది. నారాయణ బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వివాహ మైనప్పటి నుంచి వివిధ కారణాలతో భార్యతో గొడవపడుతుండేవాడు. దీనికితోడు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం నుంచి వీరు కడప నగర శివార్లలోని శ్రీరాం నగర్ కాలనీలో నివసిస్తున్నారు. ప్రతి రోజూ లాగానే మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. తర్వాత ఆమెను మచ్చు కత్తితో విచక్షణా రహితంగా నరికి దారుణంగా హత్య చేశాడు. గంగాదేవి అలాగే మంచంలోనే కుప్పకూలి మృతి చెందింది. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్, రిమ్స్ సీఐ మోహన్ ప్రసాద్, ఎస్‌ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో పరిశీలించారు. మృతురాలి సోదరుడు శివగంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 పోలీసుల అదుపులో నిందితుడు
తన భార్య గంగాదేవిని దారుణంగా మచ్చు కత్తితో నరికి చంపిన నారాయణ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

మరిన్ని వార్తలు