ఆదరణ తగ్గని పుస్తక పఠనం

13 Dec, 2016 01:31 IST|Sakshi
ఆదరణ తగ్గని పుస్తక పఠనం

ఏటేటా లక్షలాది గ్రంథాల అమ్మకాలు
15 నుంచి హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన


అందమైన అక్షరాల ఒడి.. జ్ఞానప్రియుల అద్భుత లోకం.. వందలు, వేల సంవత్సరాల చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న భాండాగారం.. గతాన్ని వర్తమానానికి, వర్తమానాన్ని భవిష్యత్తుకు అనుసంధానిస్తూ మానవసమాజాన్ని నవోత్సాహంతో ముందుకు నడిపించే అద్భుత చోదక శక్తి ‘పుస్తకం’. కళలు, సంస్కృతులు, సంప్రదాయాలు, భక్తి, ఆధ్యాత్మికం, చరిత్ర, తత్వశాస్త్రం, మనస్తత్వం, సామాజికం, ఆర్థికం, రాజకీయం, జాతీయం,అంతర్జాతీయం.. అన్ని అంశాలకు ప్రతిబింబం. కాగితాల దొంతరలో కూర్చిన అక్షరాల వెంట పరుగులు పెట్టే నేత్రాలు.. భావాన్ని మనసు పొరల్లో నిక్షిప్తంచేసే మరో ప్రపంచం ‘పుస్తకం’. వాట్సప్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌ రాజ్యమేలుతోన్న కాలంలోనూ పుస్తకం వన్నె తరగలేదు. వైభవాన్ని కోల్పోలేదు. పాఠకుడి ఆదరణ, జిజ్ఞాస మేరకు అన్ని రంగాల్లోకి రెక్కలల్లార్చుకొని విస్తరిస్తూనే ఉంది. విభిన్న భాషా సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌ నగరంలో వందల ఏళ్లుగా పుస్తకం వర్ధిల్లుతూనే ఉంది. అలా పాఠకుల ఆదరాభిమానాలతోనే మూడు దశాబ్దాలకు పైగా మహానగరంలో ఏటేటా వేడుక చేసుకుంటోన్న పుస్తకం మరోసారి ప్రదర్శనకు సన్నద్ధమవుతోంది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు ఇందిరాపార్కు ఎన్టీఆర్‌ స్టేడియం ‘హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన’కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
– సాక్షి,సిటీబ్యూరో


సామాజిక మార్పులకు అనుగుణంగా పుస్తకం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. మానవ సంబంధాల్లో, మార్కెట్‌ సంబంధాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా పుస్తకం స్పందిస్తోంది. కాల్పనిక సాహిత్యం, చారిత్రక గ్రంథాలు అప్పటి తరాన్ని ప్రభావితం చేస్తే.. ఇప్పుడు మేనేజ్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ రంగాలకు చెందిన పుస్తకం లక్షల మెదళ్లకు పదును పెడుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కెరీర్‌కు పుస్తకం కేరాఫ్‌గా మారింది. అయినప్పటికీ సాహితీ పాఠకుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం చదివి మరో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు. కన్యాశుల్కంలో గిరీశం గిలిగింతలు చూస్తున్నారు. బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’లో ఏముందో తెలుసుకుంటున్నారు. ‘అసమర్ధుని జీవయాత్ర’లోని సాహిత్య సమర్థతను అంచానా వేస్తున్నారు. ప్రతి ఇంటినీ బుల్లితెర ధారావాహికలు ముంచేస్తున్నా.. అక్షరం విలువ తెలిసిన పాఠకుడు నవలను ఆదరిస్తున్నాడు. అందుకే తెలుగు, ఇంగ్లిష్‌ పుస్తక ప్రచురణ సంస్థలు పదుల సంఖ్యలో మనగలుగుతున్నాయి.

 విశాలాంధ్ర, నవోదయ, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్, ఎమెస్కో వంటి ప్రచురణ సంస్థలు దశాబ్ధాలుగా వివిధ రంగాల పుస్తకాలను ప్రచురిస్తుండగా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్, ఓరియంట్‌ బ్లాక్‌స్వాన్, కేంబ్రిడ్జి, పియర్సన్, టాటా మెగ్రాహిల్‌ వంటి పబ్లికేషన్స్‌ మాధ్యమిక, ఉన్నత విద్యారంగానికి చెందిన ప్రామాణిక పుస్తకాలను ముద్రిస్తూ పాఠకలోకానికి  చేరవయ్యాయి. ఓరియంట్‌ లాంజ్ఞన్, ఇండియా బుక్‌హౌస్‌ వంటి సంస్థలు అనేక విలువైన పుస్తకాలను అందజేస్తూనే ఉన్నాయి. రూప పబ్లిషర్స్‌ నుంచి వచ్చే చేతన్‌ బగత్, రస్కిన్‌బాండ్‌ వంటి రచయితల పుస్తకాల కోసం జిజ్ఞాసాపరులు ఎదురు చూస్తుంటారు. చేతన్‌ భగత్‌ ‘టు స్టేట్స్‌’, ‘త్రీ మిస్టేక్స్‌ ఆఫ్‌ మైలైఫ్‌’, ‘ఫైవ్‌ పాయింట్‌ సమ్‌ వన్‌’, ‘వాట్‌ యంగ్‌ ఇండియా’, ‘రెవల్యూషన్‌ 2020’ వంటి  గ్రంథాలు ఇప్పటికీ హాట్‌కేకులే. రస్కిన్‌బాండ్‌ ‘చిల్డ్రన్స్‌ ఓమ్ని బస్‌’, గ్రేట్‌ స్టోరీ ఫర్‌ చిల్డ్రెన్‌’, ‘స్కూల్‌ డేస్‌ స్కూల్‌ టైమ్స్‌’ వంటి పిల్లల పుస్తకాలకు ఎంతో క్రేజ్‌ ఉంది. ఇక విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ‘గీతాంజలి’ ఇప్పటికీ పాఠకుడి మనసు దోచుకుంటూనే ఉంది. పిల్లల కామిక్స్‌ సైతం విపరీతంగా అమ్ముడవుతున్నాయి.

ఆంగ్ల గ్రంథాలు, బిజినెస్, మేనేజ్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కాంపిటీటివ్‌ పుస్తకాలే కాదు.. తెలుగు సాహితీ గ్రంథాలకు కూడా అద్భుత ఆదరణ ఉంది. మహాకవి శ్రీశ్రీ రాసిన ‘మహాప్రస్థానం’ 1954 నుంచి ఇప్పటి వరకు 33 సార్లు ముద్రించారు. ఈ పుస్తకం నగరంలో ప్రతిరోజు కనీసం 200 కాపీలు అమ్ముడవుతూనే ఉంది. తస్లీమా నస్రీన్‌ ‘లజ్జ’ నవల, తాపీ ధర్మారావు ‘పెళ్లి–దాని పుట్టుపూర్వోత్తరాలు’, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్యల సాహిత్యం, ముళ్లపూడి రచనలు, తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’ ,పెద్దిభొట్ల, మధురాంతకం రాజారాం వంటి ప్రముఖ రచయితల కథల పుస్తకాలు, మనస్తత్వ గ్రంథాలు, తెలుగు సినిమా సాహిత్యం, బాపు కార్టూన్లు, వట్టికోట ఆళ్వారుస్వామి ‘మట్టి మనిషి’, ‘గంగు’నవలల కోసం పాఠకులు వెతికి మరీ చదువుతున్నారు. అంతేనా.. మేనేజ్‌మెంట్‌ గురించి తెలుసుకునేవారు కూడా రామాయణం. మహాభారతాన్ని చదువుతున్నారు. ఆనాటి పరిస్థితులనునేటి స్థితిగతులకు అన్వయిస్తూ.. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అంచనా వేస్తున్నారు. అందుకే జీవిత సత్యాలను చెప్పే ఈ మహాగ్రంథాలు ప్రతి కార్పొరేట్‌ కార్యాలయంలో కొలువుదీరుతున్నాయి.

15 నుంచి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌
ఎన్‌టీఆర్‌ స్టేడియంలో ఈనెల 15న 30వ ‘హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌’ ప్రారంభమవుతుందని బుక్‌ ఫెయిర్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎస్‌.రఘు, కార్యదర్శి చంద్రమోహన్‌ తెలిపారు. 16 నుంచి 10 రోజుల పాటు సాహిత్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్స్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎస్వీ సత్యనారాయణ హాజరవుతారన్నారు. తెలుగు సాహిత్యంలోని ధోరణులు, అస్తిత్వ ఉద్యమాలు, రచయితల పాత్ర, కథ, నవల, వచన కవిత–పరిణామ వికాసాలు, ఉద్యమాలు–పాట ప్రభావం, తెలంగాణ సినిమా, అభ్యుదయ సాహిత్యం, స్త్రీవాద సాహిత్యం, బాలసాహిత్యం తదితర అంశాలపై సాహితీవేత్తలతో ప్రసంగాలు ఉంటాయని వివరించారు. మహాశ్వేతాదేవి సాహిత్య ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా‡వెంకటేశం, గూడ అంజన్న ప్రాంగణాన్ని డాక్టర్‌ కె.వి.రమణాచారి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎన్‌.గోపి. నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, ఎం.వేదకుమార్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, ముదిగంటి సుజాతరెడ్డి, యాకూబ్, సుద్దాల అశోక్‌తేజ, భూపాల్, ఏలె లక్ష్మణ్‌ వంటి సాహితీవేత్తలు పాల్గొంటారని తెలిపారు.  – సుందరయ్య విజ్ఞానకేంద్రం

280 స్టాళ్లతో ప్రదర్శన..
వైవిధ్యభరితమైన భాగ్యనగర సంస్కృతిని, విభిన్న జీవన శైలులను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలకు ‘హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన’ మరోసారి వేదిక కానుంది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న ఈ వేడుకలో 280 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. శని,ఆది వారాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శణ కమిటీ ఈ  ప్రదర్శనను నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు