విద్యార్థులకు బస్సుపాస్‌లు కావాలంటే...

14 Jun, 2016 03:24 IST|Sakshi

కడప అర్బన్ : విద్యా సంవత్సరం ఈనెల 13 నుంచి ప్రారంభమైంది. ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత, రాయితీ బస్సు పాస్‌ల జారీ ఇప్పటికే ప్రారంభమైంది. గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాల విద్యార్థులందరూ బస్సుపాస్ పొందేందుకు అర్హులు.
* 12 సంవత్సరాల వయసు వరకు పాఠశాల విద్యార్థులు, 10 వతరగతి వరకు బాలికలు (వయసు 18 సంవత్సరాల వరకు) ఉచిత బస్సు పాస్‌లు పొందేందుకు అర్హులు.
* ఉచిత బస్సుపాస్‌లు 20 కిలోమీటర్ల వరకు, రాయితీ బస్సు పాస్‌లు 35 కిలో మీటర్ల వరకు ఇవ్వబడును.
* బస్సు పాస్ దరఖాస్తును డబ్య్లుడబ్య్లుడబ్య్లు.ఏపీఎస్‌ఆర్టీసీ.జీఓవి.ఇన్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చును.
* ఆర్టీసీ డిపోలు ఉన్న పట్టణాలలోనేగాక కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, వేంపల్లి, వీరపునాయునిపల్లె, పోరుమామిళ్ల, గాలివీడు, కోడూరు మరియు విద్యార్థులు అధికంగా ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడి పాఠశాల, కళాశాలల యాజమాన్యం వారు ఆర్టీసీ కౌంటర్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్, ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పిస్తే  ప్రతినెలా ఒక నిర్ణీత తేదీన అక్కడే బస్‌పాస్ మంజూరు చేస్తారు.
 
ఆన్‌లైన్‌లో బస్‌పాస్ నమోదు విధానం :
* విద్యార్థులు బస్సుపాస్ ఆన్‌లైన్‌లో తీసుకోవడానికి ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఏపీఎస్‌ఆర్టీసీపీఏఎస్‌ఎస్.ఐఎన్’ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* వెబ్‌సైట్ తెరుచుకోవడానికి పదవ తరగతి పైబడిన విద్యార్థులకు, పదవ తరగతి కింది స్థాయి వారికి వేర్వేరు ఐచ్చికాలు ఉంటాయి. విద్యార్థి చదువుతున్న తరగతిని బట్టి వాటిపై క్లిక్ చేయాలి.
* గత ఏడాది పాస్ తీసుకున్న వారు అప్పటి గుర్తింపు నెంబరును నమోదు చేస్తే దరఖాస్తు చేయడం త్వరగా సులభంగా పూర్తవుతుంది. లేదంటే కొత్త రిజిస్ట్రేషన్‌ను ఎంచుకుని దానిలో వివరాలు ఎంపిక చేయాలి.
* విద్యార్థి పూర్తి వివరాలు నమోదు చేసిన వెంటనే దానిపై దరఖాస్తు వస్తుంది. ఆ దరఖాస్తులో పేరు, చిరునామా, పాఠశాల, కళాశాల వివరాలు, ఆధార్‌కార్డు సంఖ్య తదితర వివరాలను నమోదు చేయాలి. తర్వాత వారి ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఆపై రూ ట్ వివరాలు కూడా నమోదు చేయాలి. పూర్తి వివరాలు పొందుపరిచిన దరఖాస్తును సబ్‌మిట్ చేసి దాని ప్రింట్‌ను తీసుకోవాలి.
* ఆ ప్రింట్‌ను సంబంధిత కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయుని సంతకంతో ధృవీకరించాలి. ధృవీకరణ పూర్తయిన తర్వాత దగ్గరిలోని బస్‌పాస్ కౌంటర్‌లో నిర్ణీత  రుసుము చెల్లించి బస్‌పాస్ తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఆర్‌ఎం గోపీనాథరెడ్డి వివరించారు.

మరిన్ని వార్తలు