కలగంపూడి (యలమంచిలి) : గంగా నది నుంచి కావేరి నది వరకు అణుశక్తి వంటి యువశక్తి ఉన్న దేశం మనదని ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ అన్నారు. అయితే యువశక్తిని వినియోగించుకోవడంలో విఫలం కావడం వల్లనే అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయామన్నారు. కలగంపూడిలోని జిట్స్ కళాశాల 10వ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ బిడ్డకు ఏ రంగంపై ఆసక్తి ఉందో తెలుసుకుని, ఆ రంగంలో ప్రోత్సహిస్తే వారికి మరే శక్తి అవసరం ఉండదని అన్నారు. శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు, అబ్దుల్ కలాం వంటి కారణ జన్ములంతా మానవరూపంలో జన్మించి దేవుళ్లుగా నిలిచారన్నారు. అలాగే తమ కడుపున ఎటువంటి కారణ జన్ములు జన్మించారో తల్లిదండ్రులు తెలుసుకుని వారిని ఆ రంగంలో ప్రోత్సహించాలన్నారు. అలాగే పిల్లలు కూడా తమకు ఏ రంగంపై ఆసక్తి ఉందో తల్లిదండ్రులకు స్పష్టం చేయాలన్నారు. ప్రతి మనిషి విజయం సాధించాలంటే బలమైన సంకల్పం, తపన, ఆత్మవిశ్వాసం, అప్రమత్తత, సహజీవనం అవసరమన్నారు. అవి ఎలా అలవాటు చేసుకోవాలో కథల రూపంలో వివరించారు. అనంతరం కళశాల చైర్మన్, మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ జోగయ్య 80వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ చేగొండి వెంకట నారాయణరావు, (రాజా), కోశాధికారి చేగొండి ప్రమీలారాణి, పాలకొల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ కర్నేని రోజా రమణి, అగ్రి కల్చరల్, ఫార్మశీ, డీఎడ్, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ టీఎస్ఆర్వీ ప్రసాద్, క్రాంతికిరణ్, హనుమాన్ చౌదరి, ఎబీఎస్ మూర్తి, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ జి.సునీల్కుమార్ బాబు, కవి చిలకమర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.