అక్రమ ఇటుక బట్టీలు

7 Mar, 2017 22:53 IST|Sakshi
అక్రమ ఇటుక బట్టీలు

► నిబంధనలు బేఖాతరు
► ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న వ్యాపారులు
► పట్టించుకోని అధికారులు


ఆదిలాబాద్‌ టౌన్ : ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో ఇటుక బట్టీలు ఇష్టారీతిగా వెలుస్తున్నాయి. ఇటుకలకు పెరుగుతున్న డిమాండ్‌తో ఆయా మండలాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా బట్టీలు వెలుస్తున్నాయి. ప్రజలు నివసించే ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటుకలను తయారు చేయాలని నిబంధనలు ఉన్నా వాటిని వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు.

నివాస ప్రాంతాలకు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో 1/ 70 చట్టం ప్రకారం తవ్వడానికి వీలు లేనప్పటికీ అవేం పట్టకుండా గ్రామాల్లో లక్షల వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఇటుకల తయారీ చేయడంతో వాతావరణం కాలుష్యమవుతుంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

రూ. లక్షల్లో గండి..
ఆదిలాబాద్‌ రూరల్, మావల మండలంలోని బట్టీసావర్‌గాం, బంగారుగూడ, మావల, అంకోలి, తంతోలి, చించూగాట్, యాపల్‌గూడ, జైనథ్‌ మండలంలోని పెన్ గంగా సమీపంలోని డోలార వద్ద ఇటుకల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటుకల విక్రయాలతో ప్రధానంగా వాణిజ్య పన్నుల శాఖ ఎక్కువగా ఆదాయం కోల్పోతుంది. సంవత్సరానికి రూ. లక్షల్లో నష్టపోవాల్సివస్తోంది. ఒక్కో ఇటుకకు రూ. 3 చొప్పన వ్యాపారులు వసూలు చేస్తున్నా చాలామంది వ్యాపారులు ప్రభుత్వానికి నయాపైసా కూడా చెల్లించడం లేదు. వ్యాపారులు 5 శాతం వ్యాట్‌ చెల్లించడం గాని, అనుమతులు పొందడం లాంటివి చేయడంలేదు.

దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతోంది. ఇటుకల తయారీకి మట్టి అవసరం. చేన్లో, గుట్టల్లో, అటవీ ప్రాంతంలోని మట్టిని తవ్వి ఇటుకలు తయారు చేస్తున్నారు. మట్టిని తవ్వాలంటే భూగర్భ శాఖ, గ్రామపంచాయతీ అనుమతి కూడా ఉండాలి. ఆదిలాబాద్‌ రూరల్, మావల మండలాల్లో కుప్పలు తెప్పలుగా ఇటుక బట్టీలు వెలసినా ఏ ఒక్కదానికి అనుమతులు లేదని తెలుస్తోంది. ఇటుకలు విక్రయించాక అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విలువ అధారిత పన్ను (వ్యాట్‌) వీటికి ఐదుశాతం ఉంది. ఈ విక్రయాలకు పన్ను చెల్లించాల్సి ఉన్నా అది కూడా అమలు కావడం లేదు.

పట్టించుకోని అధికారులు
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అనుమతి లేని ఇటుక బట్టీలు వెలుస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మట్టికోసం గుట్టలను తవ్వుతున్నా అటవీశాఖ అధికారుల్లో చలనం కన్పించడం లేదు. రోజురోజుకు ఈ వ్యాపారం ఊపందుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులుస్పందించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి్సన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

బట్టీల్లో మగ్గుతున్న బాల్యం
6–14 సంవత్సరాల లోపు పిల్లలంతా  విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లోనే ఉండాలి. కానీ ఇటుకలు తయారు చేసే కార్మికుల పిల్లల బాల్యం బట్టీల్లోనే మగ్గుతోంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా మట్టి పనిలోనే  నిమగ్నమవుతున్నారు. విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారుల పట్టింపు లేనితనంతో వారి బాల్యం బుగ్గిపాలవుతోంది. ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ పాఠశాలలు లేక పోవడంతో చదువుకు దూరమవుతున్నారు.  

చర్యలు తీసుకుంటాం
ఇటుక వ్యాపారం కొనసాగించాలంటే గ్రామపంచాయతీతో పాటు మైనింగ్‌ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణ కొనసాగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా ఇటుక వ్యాపారం సాగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారి వివరాలు సేకరించాం. నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం.
– శ్రీదేవి,  ఆదిలాబాద్‌ రూరల్‌  తహసీల్దార్‌

మరిన్ని వార్తలు