ప్రేయసి ఇంటి ముందు యువకుడి మృతదేహం

22 Apr, 2016 07:06 IST|Sakshi
ప్రేయసి ఇంటి ముందు యువకుడి మృతదేహం

ప్రేయసి ఇంటి ముందు పునాదిలో  యువకుడి మృతదేహం
కుక్కలు తవ్వడంతో ఆలస్యంగా  వెలుగులోకి..
పది రోజుల కిందట హతమార్చి పాతి పెట్టి ఉంటారన్న అనుమానాలు
మృతుడు అనంతపురం మరవకొట్టాలకు చెందిన తిరుపాల్‌గా గుర్తింపు

 
 పెళ్లైన పదేళ్లకు పరస్త్రీ వ్యామోహంలో పడి న అతను భార్యను      నిర్లక్ష్యం చేశాడు. అంతటితో ఆగక తనతో వివాహేతర సంబంధం కలిగిన మహిళతోనే ఏకంగా వేరుగా ఇల్లు తీసుకుని సహజీవనం సాగించాడు. పదిహేను రోజులుగా భర్త ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ భార్య విషయాన్ని తన అత్తమామలకు తెలిపింది. వారు ఎలాగోలా తమ కుమారుడి జాడ కనుగొని బుద్ధి చెప్పారు. అంతే.. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో పది రోజులు తరువాత ప్రియురాలి నివాసం ముందు నిర్మించిన ఇంటి పునాదిలో అతని మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.  అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.  - రాప్తాడు
 

 
రాప్తాడు మండలం చిన్మయానగర్ సమీపంలోని కళాకారుల కాలనీలో కలకలం రేగింది. అనంతపురంలోని మరవకొట్టాలకు చెందిన లక్ష్మిదేవి, కొండయ్య దంపతుల కుమారుడు సాకే తిరుపాల్(30) మృతదేహం లభ్యం కావడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ప్రియురాలి ఇంటి ముందే ఈ ఘటన వెలుగు చూడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ధర్మవరం గీతానగర్‌కు చెందిన లక్ష్మీదేవి కుమార్తె దుర్గతో పదేళ్ల కిందట తిరుపాల్ వివాహమైంది. సజావుగా సాగిపోతున్న వారి కాపురంలోకి మరో మహిళ ప్రవేశంతో కలతలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అతను చిన్మయానగర్‌లోని కళాకారుల కాలనీలో వేరు కాపురం పెట్టి ఏకంగా సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. పది హేను రోజులుగా ఇంటికి వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన భార్య విషయాన్ని అత్తమామల దృష్టికి తీసుకెళ్లింది.
 వారు ఎలాగోలా తమ కుమారుడు వేరు కాపురం పెట్టిన ప్రదేశాన్ని కనుగొని ఇద్దరినీ మందలించారు. ఈ సంఘటన జరిగి పది రోజులు కావస్తోంది.


 వెలుగులోకి వచ్చింది ఇలా...
 తిరుపాల్ సహజీవనం చేసిన మహిళ ఉండే ఇంటి ముందే పునాది నుంచి గురువారం దుర్వాసన వచ్చింది. అంతలోనే కుక్కలన్నీ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశాయి. దీంతో ఆ వాసనను అక్కడి పరిసర ప్రాంతాల జనం భరించలేకపోయారు. ఇరుగుపొరుగు వారు పునాది వద్దకు వెళ్లి చూడగా ఎముకలు, పుర్రె కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


 రంగంలోకి పోలీసులు
 సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తమ సిబ్బందితో కలసి హుటాహుటిన నేర స్థలికి చేరుకున్నారు. ఎముకలు, పుర్రె ఇతర భాగాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో పడి ఉన్న దుస్తులు, చెప్పులు చూసి.. అనంతపురం మరవ కొట్టాలకు చెందిన తిరుపాల్‌గా గుర్తించారు. మృతుడి భార్య, తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు.


ప్రియురాలిపైనే అనుమానాలు
తనతో సహజీవనం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని తిరుపాల్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ మందలించడాన్ని జీర్ణించుకోలేని ప్రియురాలే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. పది రోజుల నుంచి ఆమె స్థానికంగా లేకపోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు