ఏలూరు అర్బన్: ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు, చికిత్సలతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు స్వచ్ఛ ఆస్పత్రి అభియాన్ పేరిట కొత్త పథకం అమలుకు చర్యలు ప్రారంభించామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కె.కోటేశ్వరి తెలిపారు. స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో బుధవారం స్వచ్ఛ ఆస్పత్రి అభియాన్ పథకంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో బయోవేస్ట్ మేనేజ్మెంట్, ఆవరణ, పరిసరాలు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు కార్పొరేట్ స్థాయిలో అత్యంత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛ ఆస్పత్రి అభియాన్ అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా క్వాలిటీ అధికారి మనోజ్, జిల్లా ప్రభుత్వాస్పత్రి క్వాలిటీ అధికారి, ఝాన్సీ దుర్గారాణి, ప్రాజెక్ట్ అధికారి డాక్టర్, జె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.