పాలకొల్లు సెంట్రల్ : స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలు నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దక్షిణ భారత చిత్రకారులచే చిత్రకళా ప్రదర్శన క్యాంపు ఏర్పాటు చేశారు. శనివారం ప్రారంభించిన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు క్లబ్ అధ్యక్షులు అధికారి కృష్ణ తెలిపారు. వడ్డాది పాపయ్య, బాపుల పేరున వపా బాపు ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు డి. రామకృష్ణారావు నిర్వహణలో ఈ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వేసిన చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ చిత్రకళాకారులు ఇంత దూరం వచ్చి పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మద్రాసుకు చెందిన లెటరింగ్ ఆర్టిస్ట్ అంకయ్యను ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ సెక్రటరీ బోడా చక్రవర్తి, ట్రెజరర్ పాటపళ్ల ప్రసాద్, ఎన్వీఎస్ఎస్ పాపారావునాయుడు, కొమ్ముల మురళి, వపాబాపు ఆర్ట్ అకాడమీ సెక్రటరీ కొత్తపల్లి శ్రీను, గొన్నాబత్తుల సత్యనారాయణ, ముగడ నాగేశ్వరరావు, రావూరి అప్పారావు పాల్గొన్నారు.