భార్య, కూతురు హత్య.. ఆపై దహనం

30 May, 2016 03:52 IST|Sakshi
భార్య, కూతురు హత్య.. ఆపై దహనం

మెదక్ జిల్లాలో ఓ కిరాతకుడి ఘాతుకం
 
 చేగుంట: భార్య, కూతురిని హత్య చేసి ఆపై దహనం చేశాడో కిరాతకుడు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లం, ఎల్లవ్వ దంపతులకు శృతి అనే మూడేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా ఎల్లవ్వను భర్త వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం అత్త లక్ష్మి, భర్త ఎల్లంలు గొడవ పెట్టుకొని ఎల్లవ్వను కొట్టారు. మనస్తాపం చెందిన ఆమె తన కూతురు శృతి(3)ని తీసుకొని పొలం వద్దకు వెళ్లింది. అక్కడికీ వచ్చిన భర్త మరోసారి గొడవపడి భార్య, కూతురిని హత్య చేసి.. అనంతరం దహనం చేశాడు.

ఈ ఘటనను ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు యత్నించాడు. ఏం తెలియనట్టుగా తన భార్య ఇంటికి రాలేదని నాటకమాడి గ్రామస్తులతో వెతికించాడు. ఎక్కడా దొరక్క పోవడంతో పొలం వద్దకు వెళ్లి ఉంటుందని అక్కడికి వెళ్లాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లిచూడగా ఎల్లవ్వతోపాటు కూతురు శృతి మంటల్లో కాలిపోయి విగత జీవులుగా కనిపించారు. ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడితే, మంటలకు పరిగెత్తే వారని, కాలిపోయి మంటలంటుకున్న చోటే శవాలు పడి ఉండటంతో ఇది ముమ్మాటికి హత్యేనని ఎల్లవ్వ తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు