మండే సూరీడు

18 Apr, 2017 01:58 IST|Sakshi
మండే సూరీడు

రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత
ఉక్కపోతతో  అల్లాడుతున్న జనం


తిరుపతి తుడా: ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో రహదారులన్నీ కర్ఫ్యూను తలపించేలా నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం వేళల్లో ఎండతీవ్రత అధికంగా ఉండడంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు వేడి గాలుల ప్రభావం మొదలు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం వేళల్లో కొంతమేర చల్ల గాలు లు వీస్తుండడంతో ఉపశమనం కలుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జిల్లాలో 50.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈసారి ఏప్రిల్‌ మూడో వారంలోనే 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక ఏప్రిల్‌ చివరివారం, మేలో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా చిత్తూరు రికార్డుల్లోకి ఎక్కింది. సోమవారం మరో 0.3 డిగ్రీలు పెరిగింది.

హెచ్చరికలు
ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తూర్పు బంగాళా ఖాతంలో ఎన్‌నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు