భారత్‌ అగ్రరాజ్యంగా ఎదగడం ఖాయం

11 Aug, 2016 20:07 IST|Sakshi
భారత్‌ అగ్రరాజ్యంగా ఎదగడం ఖాయం
నూజివీడు :
 మన దేశంలో ప్రపంచంలోఎక్కడా లేని విధంగా యువశక్తి ఉందని, ఈ శక్తిని సమర్థంతంగా ఉపయోగించుకుంటే కొద్దికాలంలోనే భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగడం ఖాయమని ఆర్జీయూకేటీ చాన్సలర్‌ రాజ్‌రెడ్డి అన్నారు. రూ.14 కోట్లతో నిర్మించిన స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్న సాంకేతిక విద్యను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. సమాచార సాంకేతికను ఉపయోగించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ముందస్తు మార్పులను గమనిస్తూ వాటిని ఆకళింపు చేసుకుంటూ తదనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ట్రిపుల్‌ఐటీ విద్యార్థులంటే దేశంలోనే రోల్‌మోడల్‌గా ఉండాలన్నారు. అనంతరం ఫ్లిప్‌డ్‌ క్లాస్‌ రూమ్‌లను ప్రారంభించారు. స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ వద్ద ఛాన్సలర్‌ రాజ్‌రెడ్డి మొక్కలు నాటారు. 
ఆకట్టుకున్న యోగా ప్రదర్శన..
ట్రిపుల్‌ ఐటీ యోగా విద్యార్థులు చేసిన ప్రదర్శన చాన్సలర్‌తో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. వందేమాతరం గీతానికి అనుగుణంగా రూపొందించిన ఈ యోగాసనాలను చూసి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి వీసీ పీ విజయప్రకాష్, డైరెక్టర్‌ ఆచార్య వీరంకి వెంకటదాసు, ఈసీ సభ్యుడు ఉన్నం వెంకయ్య, ఏవో పీ అప్పలనాయుడు, డీన్‌ అకడమిక్‌ కోసూరి హనుమంతరావు, ఇడుపులపాయ డీన్‌ అకడమిక్‌ వేణుగోపాలరెడ్డి,  ఫైనాన్స్‌ అధికారి అరుణకుమారి, ఏపీఆర్వో కిరణ్మయి పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు