భర్త ఎదుటే భార్య పట్ల అసభ్య ప్రవర్తన

18 Jun, 2016 08:19 IST|Sakshi
భర్త ఎదుటే భార్య పట్ల అసభ్య ప్రవర్తన

ముగ్గురిపై కేసు నమోదు, రిమాండ్
పరిగి : భార్యాభర్తలపై దాడి చేయడమే కాకుండా భర్త ఎదుటే భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ నగేష్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. హైదరాబాద్ నగర శివారులోని బీహెచ్‌ఈఎల్ ప్రాంతానికి చెందిన యాదగిరి తన భార్య, కుమార్తెతో కలిసి గురువారం రంగారెడ్డి జిల్లా పరిగిలో నివాసముండే తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి అయ్యేసరికి రాత్రి అయ్యింది. దీంతో పది గంటల సమయంలో యాదగిరి కుటుంబం హైదరాబాద్‌కు బయలుదేనిందిజ అయితే అలసట అనిపించడంతో యాదగిరి కారును మండల పరిధిలోని రంగాపూర్‌లో రోడ్డు పక్కన ఆపాడు.

ఈ సమయంలో రంగాపూర్‌కు చెందిన నర్సింహారెడ్డి, అరవింద్‌రెడ్డి, సంజీవరెడ్డిలు కారు వద్దకు వచ్చారు. ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అలసటగా ఉండడంతో ఆపామని, తామిద్దరం భార్యాభర్తలమని చెప్పినా వారు వినిపించుకోలేదు. తాము పోలీసులమని, కారుకు సంబంధించిన కాగితాలు చూపాలని వారిపై దాడికి దిగారు. అంతటితో ఆగక.. యాదగిరి భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న యాదగిరి కుటుంబం నేరుగా పరిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ నగేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు