ఇంద్రకీలాద్రి టూ శబరిమల

5 Nov, 2016 23:29 IST|Sakshi
ఇంద్రకీలాద్రి టూ శబరిమల

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధి వరకు  పాదయాత్రను చేపట్టారు నగరానికి చెందిన ఇద్దరు అయ్యప్ప మాలధారులు. విజయవాడ సమీపంలోని జక్కంపూడి గ్రామానికి చెందిన తన్నేరు వెంకట శివ మల్లేశ్వరరావు, తాపీ మేస్త్రీ పాలబోయిన వెంకటేశ్వరరావు అయ్యప్ప మాలధారణ చేశారు.  అయ్యప్ప సన్నిధికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాలని  నిర్ణయించుకుని శుక్రవారం రాత్రి ఇరుముడి ధారణతో బయలుదేరారు. శుక్రవారం రాత్రి అమ్మవారి సన్నిధికి చేరుకుని నిద్ర చేసిన స్వాములు, తెల్లవారుజామున స్నానంచేసిన అనంతరం స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి దుర్గమ్మను దర్శించుకుని యాత్ర ప్రారంభించారు. మొత్తం 1250 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందని వెంకటేశ్వరరావు చెప్పారు.  గ్రామంలో అయ్యప్పస్వామి ఆలయాన్ని నిర్మించిన వెంకటేశ్వరరావు, ఆలయ నిర్మాణం ఎటువంటి అడ్డంకులు లేకుండా  చూడాలని స్వామి వారికి మొక్కుకున్నారు. గుడి నిర్మాణం పూర్తికావడంతో స్వామివారికి మొక్కు చెల్లించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.
 

మరిన్ని వార్తలు