లస్కర్‌ పోస్టుల రెగ్యులర్‌ నియామకాల్లో అక్రమాలు

24 Jul, 2016 17:35 IST|Sakshi
లస్కర్‌ పోస్టుల రెగ్యులర్‌ నియామకాల్లో అక్రమాలు
– సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశం
– న్యాయం చేయాలంటున్న బాధితులు
 
కర్నూలు సిటీ:
శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన లస్కర్‌ పోస్టుల నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు 1986లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జీఓ 98ను అమలుకు 25 ఏళ్ల తర్వాత కదలిక వచ్చింది. రెగ్యులర్‌ నియమాకాలు లేకపోవడంతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రాజెక్టుల్లో దాదాపు 962 మంది ముంపు బాధితుల్లో 80 శాతం మందిని తాత్కాలిక లస్కర్లుగా నియమించారు. వీరిలో సీనియారిటీ ఉన్న వారికి విద్యా అర్హతతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీల్లో కొంత మందిని ప్రస్తుతం రెగ్యులర్‌ పోస్టుల్లో నియమిస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల 30వ తేదీన 15 మంది తాత్కాలిక లస్కర్లను రెగ్యులర్‌ చేస్తూ చీఫ్‌ ఇంజనీర్‌ చిట్టి్టబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ నియామకాల్లో ఐటీఐ సివిల్‌ డ్రాఫ్ట్‌ చేసిన వారితో భర్తీ చేయాలి. అయితే ఇక్కడ నిబంధనలను ఉల్లఘించి జూనియర్లను రెగ్యులర్‌ చేశారనే విమర్శల ఉన్నాయి.  
– టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రిషన్, మెకానిక్‌ అర్హత ఉన్న వారితో భర్తీ చేశారు. దీంతో బీటెక్‌ చేసిన శ్రీనివాసులు, ఐటీఐ సివిల్‌ డ్రాఫ్ట్‌ చేసిన శేషన్నకు అన్యాయం జరిగిందని అధికారుల దృష్టికి తెచ్చారు. 
– ఆఫీస్‌ సబార్డినేట్‌ కింద ఎంపికైన ఓ మహిళకు ఇంటిగ్రేటేడ్‌ సీనియార్టీ జాబితాలో నంబర్‌ 797.  సినియార్టీ జాబితాలో గుంపుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ముందున్నా అతనికి అన్యాయం జరిగింది. 
 
కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం:
శ్రీశైలం ముంపు బాధితుల్లో తాత్కాలిక లస్కర్లుగా పని చేస్తున్న వారిని రెగ్యులర్‌ చేస్తూ ఇచ్చిన జాబితాలో అక్రమాలు జరిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సీనియర్లను కాదని, జూనియర్లను రెగ్యులర్‌ చేయడంపై కొందరు బాధితులు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ నియామకాలపై కొందరు తాత్కాలిక లస్కర్లు జిల్లా కలెక్టర్, డిప్యూటీ సీఈలను కలిసి విన్నవించారు.
 
ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాం:
తాత్కాలిక లస్కర్లుగా పని చేస్తున్న వారిలో 15 మందికి రెగ్యులర్‌ చేశాం, ఇందులో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఒక వేళ తప్పులు జరిగాయని ఫిర్యాదులు వస్తే పరిశీలించి సరి చేసేందుకే నోటీసు బోర్డులో వివరాలు ఉంచాం. రెగ్యులర్‌ చేసేందుకు సీనియారీటికి ప్రాధాన్యత, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాం. జూనియర్లలో ఉన్నత విద్య చదివిన వారు ఉన్నా సీనియర్లకు అన్యాయం చేయకూడదు.
– చిట్టిబాబు, సీఈ, జల వనరుల శాఖ ప్రాజెక్టు 
 
మరిన్ని వార్తలు