స్ఫూర్తితోనే ప్రజా ఉద్యమాలు

31 Jul, 2016 20:55 IST|Sakshi
స్ఫూర్తితోనే ప్రజా ఉద్యమాలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
 
గుంటూరు వెస్ట్‌: కమ్యూనిస్టు యోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించి సమస్యలపై పోరాడి ప్రజలకు అండగా నిలబడటమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో ఇటీవల నిర్మించిన డైనింగ్‌ హాలును సీపీఎం సీనియర్‌ నాయకుడు సింహాద్రి శివారెడ్డి ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభకు పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా మధు మాట్లాడుతూ తెలంగాణా సాయుధ పోరాటంలో గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకుల పాత్ర కీలకమైందన్నారు. సరళీకత ఆర్థిక విధానాల నేపథ్యంలో మారిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అసంఘటితరంగంలో ఉన్న ప్రజల తరపున ఉద్యమాలు నిర్మించాల్సి ఉందన్నారు. రాజధాని నిర్మాణం, పెరుగుతున్న ఉద్యమాల నేపథ్యంలో కార్యాలయాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  అనంతరం జిల్లాలో పార్టీకి విశేష సేవలు అందించిన సింహాద్రి శివారెడ్డి, బొల్లు శంకరరావులను శాలువాలతో సన్మానించారు.
మరిన్ని వార్తలు