ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

1 Mar, 2017 22:53 IST|Sakshi
ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
– 96.96 శాతం హాజరు
 – గైర్హాజరైన వారిలో సైన్స్‌ విద్యార్థులే అధికం
  
కర్నూలు సిటీ: బుధవారం నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరే సమయంపై ముందు నుంచే అధికారులు ప్రచారం కల్పించ పోవడంతో అక్కడక్కడ కొంత ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్నారు. అదే విధంగా మరి కొన్న చోట్ల పరీక్ష సమయానికి చేరుకోలేక పోయిన వారికి అనుమతించక పోవడంతో విద్యార్థులు కన్నీళ్ళు పెట్టుకుంటు వెనుదిరిగారు. 
 
1213 మంది విద్యార్థులు గైర్హాజరు :
 జిల్లాలో ఉన్న 218 జూనియర్‌ కాలేజీలకు చెందిన మొత్తం 39963 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు హాల్‌ టికెట్లు వచ్చాయి. వివిధ కారణాల వల్ల 38750 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 1213 మంది పరీక్షలకు హాజరు కాలేకపోయినట్లు ఆర్‌ఐఓ తెలిపారు. మొదటి రోజు జిల్లాలో ఎక్కడ కూడా మాల్‌ ప్రాక్టిస్‌ కానీ, కాపీయింగ్‌ జరుగలేదని అధికారులు పేర్కొన్నారు.
 
హాజరుకానివారిలో సైన్స్‌ విద్యార్థులే అధికం: 
 నిర్ణీత హాజరు శాతం లేని సైన్స్‌ విద్యార్థులకు హాల్‌ టికెట్స్‌ ఇవ్వక పోవడంతో చాలా మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్ట్స్‌ విద్యార్థులకయితే నిర్ణీత రుసం చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చు. అయితే మంగళవారం బ్యాంకు అధికారుల ధర్నా వల్ల బ్యాంకులు తెరుచుకోలేదు. ఈ కారణంతో మరి కొంతమంది విద్యార్థులు హాల్‌ టికెట్లు పొందలేకపోవడంతో పరీక్షలు రాయలేకపోయారు. ఈ విషయంపై ముందు నుంచే విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చిరించినా బోర్డు అధికారులు సరైన రీతిలో స్పందించక పోవడం వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేక పోయారని తెలుస్తోంది.  
 
నిర్ణీత సమయానికి కేంద్రాలకు...!
ఇంటర్‌ బోర్డు అధికారులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించిన మేరకు కేంద్రాలకు చేరుకున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే కొంత ఆలస్యంగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. మరికొన్ని చోట్ల నిర్ణీత సమయానికి చేరుకోలేక పోయారని వెనిక్కి పంపించారు.  ఆర్‌ఐఓ వై.పరమేశ్వరరెడ్డి నగరంలోని వాసవి, కోల్స్, అమరావతి జూనియర్‌ కాలేజీలను తనిఖీ చేశారు. 
 
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ...
నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై కళాశాల ప్రిన్సిపల్‌ సునీతను అడిగి తెలుసుకున్నారు. 
 
మరిన్ని వార్తలు