ఇలా మొదలయ్యాయి

1 Mar, 2017 23:23 IST|Sakshi
ఇలా మొదలయ్యాయి
ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం
 ఫస్టియర్‌ పరీక్షలకు 36,108 మంది హాజరు
 1,845 మంది గైర్హాజరు
 
ఏలూరు సిటీ :
ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు ఉత్సాహంగా కేంద్రాలకు పయనమయ్యారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, 8గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థుల వెంట రావడంతో పరీక్షా కేంద్రాల వద్ద కోలాహలం కనిపించింది. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్‌1 పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 104 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 37,953 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 1,845 మంది గైర్హాజరయ్యారు. 36,108 మంది పరీక్షలు రాశారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదు. ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్‌ఏ ఖాదర్‌ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని తెలిపారు. మాస్‌ కాపీయింగ్, మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. 4 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్, 5 సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ను నియమించి ఎప్పటికప్పుడు తనిఖీ చేపట్టేలా చూస్తున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక‌్షన్‌ విధించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 
 
 కాపీ కొడితే నాలుగేళ్లు డిబార్‌
విద్యార్థులు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే నాలుగేళ్లపాటు పరీక్షలు రాయకుండా డిబార్‌ చేయాలంటూ ఆదేశాలు అందాయని ఆర్‌ఐవో తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు