కొండవీడులో ప్రపంచస్థాయి రిసార్ట్‌

16 Oct, 2016 18:19 IST|Sakshi
కొండవీడులో ప్రపంచస్థాయి రిసార్ట్‌
ప్రభుత్వం అనుమతిస్తే నిర్మిస్తాం
గోల్కొండ గ్రూప్స్‌ అధినేత రామిరెడ్డి ప్రకటన
 
యడ్లపాడు: అంతర్జాతీయ ప్రమాణాలతో  కొండవీడులో రిసార్ట్‌ ఏర్పాటు చేయనున్నానని గోల్కొండ హోటల్స్‌ గ్రూప్‌ అధినేత నడికట్టు రామిరెడ్డి చెప్పారు. శనివారం ఈ ప్రాంతాన్ని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కే శివారెడ్డితో కలిసి రామిరెడ్డి సందర్శించారు. ఘాట్‌రోడ్డు పనులు, కొండలపై ఉన్న కట్టడాల వివరాలు తదితర అంశాలను శివారెడ్డి, కాంట్రాక్టర్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, గరికపాటి సుబ్బారావులను అడిగి తెలుసుకున్నారు. రామిరెడ్డి, శివారెడ్డి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో ఫోన్‌లో మాట్లాడారు. అతి త్వరలోనే అటవీ భూములను కేంద్రం డీనోటిఫై చేస్తుందని, అన్నిరకాల అనుమతులు  సులభంగా వస్తాయని మంత్రి వెల్లడించినట్లు చెప్పారు. రిసార్ట్‌ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. కొండవీడు నుంచి బోయపాలెం వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికే రూ.8 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని రామిరెడ్డి పేర్కొన్నారు.
 
రాజధానికి తలమానికం కానుంది..
కొండవీడుకు దగ్గర్లోని చిరుమామిళ్లలో జన్మించడం వల్ల జన్మభూమికి ఖ్యాతి తెచ్చేందుకు రిసార్ట్‌ నిర్మాణం చేయాలని సంకల్పించామని ఆయన తెలిపారు. కొండవీడులో ప్రపంచస్థాయి రిసార్ట్‌ నిర్మించాలనేదే తన లక్ష్యమన్నారు. గుంటూరుకు కొండవీడు ఊటీగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందుకు కనీసం 30 ఎకరాల విస్తీర్ణం అవసరమని, ప్రాథమికంగా రూ.30 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ప్రాజెక్టు ప్రణాళిక రూపం దాల్చితేగానీ పూర్తి విషయాలు చెప్పలేని స్పష్టం చేశారు.
మరిన్ని వార్తలు