టీసీ ఇవ్వలేదని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

21 Jun, 2016 02:02 IST|Sakshi

కారేపల్లి: ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం టీసీ ఇవ్వలేదని..ఇంటర్ విద్యార్థిని జ్వరం టాబ్లెట్లు, కిరోసిన్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...గుంపెళ్లగూడెం గ్రామానికి చెందిన తాటి స్వప్న కారేపల్లిలోని ఓ ప్రైవేటు  కళాశాలలో గత ఏడాది  ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేయగా, కొన్ని సబ్జెక్టులు తప్పాయి. అప్పటి నుంచి టీసీ, సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాల యాజమాన్యం చుట్టూ తిరిగింది.

ఈ ఏడాదైన సర్టిఫికెట్లు ఇస్తారేమోననే ఆశతో స్వప్న ఈ నెల 18వ తేదీన  కాలేజీకి వెళ్లగా..సోమవారం ఇస్తామని యాజమాన్యం తెలిపింది. ఉదయం స్వప్న కాలేజీకి వెళ్లగా, వ్యాను ఫీజు రూ. 2 వేలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని దబాయించారు.

దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి  పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు స్వప్నను స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు, అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం  తరలించారు.

మరిన్ని వార్తలు