అక్రమార్కుల ‘ఉపాధి’ రూ.28 కోట్లు..!

6 Jan, 2017 22:40 IST|Sakshi

ఏళ్లు గడుస్తున్నా రికవరీ చేయని అధికారులు
నోటీసులు, మెమోలు ‘మామూలే..’
మూలన పడ్డ ఫైళ్లు.. అధికారులపై చర్యలు శూన్యం
దర్జాగా విధులు నిర్వర్తిస్తున్న అక్రమార్కులు
సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి..


ఆదిలాబాద్‌ కల్చరల్‌ :   గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. అందిన కాడికి అధికారులు దండుకోవడంతో అభాసుపాలవుతోంది. గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేసే చిన్నపాటి పొరపాట్లకు సస్పెండ్‌ చేస్తూ తొలగించే అధికారులు.. నిధులు కాజేసి, లెక్క చూపని అధికారులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోగా.. షోకాజు నోటీసులతో అధికార యంత్రాం గం సరిపెడుతోంది. రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఆర్టీఐ యాక్టు వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు ఠాకూర్‌ జోగేందర్‌సింగ్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు ఆర్టీఐ యాక్టు ద్వారా దరఖాస్తు చేసుకోగా.. గత ఏడాది నవంబర్‌లో వివరాలు వెల్లడించా రు. అక్రమార్కుల వివరాలు ఇందులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అధికారులు అక్రమాలకు పాల్పడి రూ.28 కోట్లు దుర్వినియోగం చేశారు. ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందనే విమర్శలున్నాయి.

చేయని పనులు చేసినట్లుగా, మట్టి, మొరం రోడ్లు వేసినట్లుగా, పనులు చేయకుండా చేసినట్లుగా, చెరువుల్లో మట్టితీత.. వంటి పలు రకాల పనులు చేయించినట్లు మస్టర్‌లు రికార్డు చేసి రూ.కోట్లలో ఉపాధి నిధుల ు దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ విషయం సామాజిక తనిఖీ బృందాల పరిశీలనలో వెల్లడైంది.

ఎవరెంత దుర్వినియోగం చేశారంటే.. : నిధులు దుర్వినియోగం చేసిన వారిలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ ఏఈఈలు, ట్రైబ ల్‌వెల్పేర్‌ ఏఈలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎంపీడీవోలు మొ త్తం రూ.కోటీ 9 లక్షల 31,593 దుర్వినియోగం చేసినట్లు సామాజిక తనిఖీ లో తేలింది. పంచాయతీ రాజ్‌ ఏఈఈలు 40 మంది రూ.కోటి 8 లక్షల 16,102 దుర్వినియోగం చేయగా.. రికార్డులు కూ డా అప్పగించని నిధులు రూ.10 కోట్ల 7 లక్షల 74,584 దుర్వినియోగం చేశారు. మొత్తం రూ.11కోట్ల 15 లక్షల 90,686 పంచాయతీరాజ్‌ ఏఈఈలు 40 మంది స్వాహా చేశారు. ట్రైబల్‌ వెల్పేర్‌ ఏఈలు 17 మంది రూ.14 లక్షల 49,861 తప్పుడు లెక్కలతో కాజేసినట్లు సామాజిక తనిఖీలో తేలింది. రికార్డులు కూడా అందించకుండా రూ.16 కోట్ల 33 లక్షల 58,947.. మొత్తం రూ. 16 కోట్ల 48 లక్షల 08,808 అక్రమాలకు గురైనట్లు సామాజిక తనిఖీ బృం దం తేల్చింది. ఉమ్మడి జిల్లా లో ఎంపీడీవోలు, పీఆర్‌ ఏఈఈలు, టీడబ్ల్యూఏఈలు కలిసి మొత్తం రూ.28 కోట్ల 73 లక్షల 31,087 దుర్వినియోగం చేశారు. ఉన్నతాధికారుల హస్తం ఉండడంతోనే రికవరీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడిన కొందరు విధుల్లోనే ఉన్నారు.

రూ.కోట్లల్లోనే అవినీతి..: కుభీర్‌ ఎంపీడీవో సత్యనారాయణ రూ. 95,09, 752 దుర్వినియోగం చేశారు. 2010లో పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ చార్జి మెమో జారీ చేశారు. పలుమార్లు చార్జి మెమోలు అందించినా ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోగా రికవరీ కూడా చేయడం లేదు. ఉట్నూర్‌కు చెందిన ఎంపీడీవో చందర్‌ 9 లక్షల నిధులకు లెక్కలు చూపలే దు. మిగతా ఎంపీడీవోలు లక్షల్లో నిధులను జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలున్నాయి. తాండూరు పీఆర్‌ ఏఈఈ రూ.10,51,905, కెరమెరి ఏఈఈ రూ.18,51,717, ఉట్నూర్‌కు చెందిన ఏఈఈ రూ.17,12,428, జైనథ్‌ ఏఈ ఈ రూ.7,55,357, తాండూరుకు చెందిన ఏఈఈ రూ.5,61,987 నిధులు దుర్వినియోగం చేశారు. తాంసి ఏఈఈ రూ.94 లక్షల 63,531, భీమిని ఏఈఈ రూ.2 కోట్ల 75 లక్షల 86,110, ఆదిలాబాద్‌ ఏఈఈ రూ.కోటీ 3 లక్షల 49,200, దహెగాం ఏఈఈ 90 లక్షల 94,476 నిధులకు లెక్కలు చూపలేదు. వీరితోపాటు వాంకిడి, జన్నారం, తదితర మండలాల పీఆర్‌ ఏఈఈ, ఏటీడబ్ల్యూ ఏఈలు, ఎంపీడీవోలు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది.

మరిన్ని వార్తలు