పేదలకు చదువు భారం దించాం

26 Jan, 2017 22:46 IST|Sakshi
పేదలకు చదువు భారం దించాం

►  రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌
మంథని: గ్రామీణ ప్రాంతాల్లోని పేద తల్లిదండ్రులపై చదువు భారం పడకుండా తమ ప్రభుత్వం కొత్త కళాశాలలు, వసతి గృహాలను ఏర్పాటుచేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంథని, కమాన్ పూర్‌ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. మంథనిలో రూ.3 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ వసతి గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు.

ఇంజినీరింగ్‌ చదివిన వ్యక్తి హోంగార్డు కోసం, ఎంబీఏ చదివినవారు చిన్న ఉద్యోగం  కోసం పోటీపడడం చూస్తే బాధేసిందన్నారు. అలాంటి కష్టాలను తీర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మారుమూల గిరిజన తడాల్లో గుడిసెల్లో విద్యార్థులు గొప్పగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం   రాగానే హాస్టళ్లలో సన్నబియ్యం పెడుతూ పేద విద్యార్థుల కడుపు నింపున్నామన్నారు.

మంథని బొక్కలవాగుపై రివర్‌ ప్లాంటు
మంథని బొక్కలవాగుపై రివర్‌ ప్లాంట్‌ నిర్మిస్తామని తెలిపారు. ఇటీవల నర్మదానదిని సందర్శించామని, అక్కడి మాదిరిగా మంథని బొక్కలవాగును అభివృద్ధి చేసి వేలాది మంది పర్యాటకులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఎన్ని కోట్ల నిధులైనా కేటాయిస్తానని హామీఇచ్చారు. ఒకనాడు హింసను, దుఖాన్ని అనుభవించిన ప్రాంతమని, వారి కష్టాలను తీర్చుతామని తెలిపారు. ఆపద వస్తే నేనున్నానని భరోసా కల్పించేవారే ప్రజాప్రతినిధి అని, అలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు.

మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంథని నియోజకవర్గ రూపురేఖలు మార్చుతానని చెప్పారు. రూ.4.10కోట్లు స్వశక్తి రుణాలు, కోటి రూపాయల స్త్రీనిధి రుణాల చెక్కును అందజేశారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ అంజయ్య, మంథని సర్పంచ్‌ పుట్ట శైలజ, మంథని, ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, జెడ్పీటీసీలు మూల సరోజన, రాజిరెడ్డి, శ్రీనివాసరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్‌ పాల్గొన్నారు.

కరెంట్‌ కష్టాలు తీర్చడానికే సబ్‌స్టేన్  నిర్మాణం
కమాన్ పూర్‌: లోవోలే్టజీ కరెంట్‌ కష్టాలను తీర్చడానికి సీఎం కేసీఆర్‌ సంకల్పంతో సబ్‌స్టేన్ ల నిర్మాణాలు చేపడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వ్యవసాయరంగానికి నిరంతరంగా పగలు తొమ్మిదిగంటల విద్యుత్‌ సరఫరా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. కమాన్ పూర్‌ మండలం గుండారంలో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేన్  బీటీ రోడ్డులను ప్రారంభించారు.   ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కరెంట్‌ కష్టాలను తీర్చడానికి కృషిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే పుట్ట మధు, ఎంపీపీ ఇనగంటి ప్రేమతల, ఏఎంసీ చైర్మన్ పీట్ల మంజూల. పీఏసీఎస్‌ చైర్మన్లు బాద్రపు మల్లేష్, మల్క రామస్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు