వర్జీనియాకు వేళాయె..

9 Oct, 2016 22:19 IST|Sakshi
వర్జీనియాకు వేళాయె..
–పొగాకు సాగుకు మెట్ట రైతుల సన్నద్ధం
        –పలు చోట్ల నాట్లు ప్రారంభం
–ఈ నెల 20 నుంచి ఊపందుకోనున్న నాట్లు
–నారుకు డిమాండ్‌
 
దేవరపల్లి : 
పొగాకు సాగుకు మెట్ట రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ వారం నుంచి అక్కడక్కడా నాట్లు వేయడం ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి పూర్తిస్థాయిలో నాట్లు ఊపందుకోనున్నాయి. నారు పెరిగినా వాతావరణంలో తరచూ మార్పులు చోటుచేసుకుంటుండడంతో రైతులు కాస్త వెనక్కుతగ్గుతున్నారు. భారీవర్షాలు, తుపానులు వస్తే కొట్టుకుపోతాయని ఆందోళన కారణంగా కొందరు రైతులు నాట్లను కావాలని ఆలస్యం చేస్తున్నారు. జిల్లాలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల పరిధిలో వాణì జ్య పంటగా రైతులు వర్జీనియాను సాగు చేస్తున్నారు. పొగాకు సాగుకు తేలికపాటి ఎర్ర నేలలు అనుకూలం కావడంతో మెట్ట ప్రాంతంలోని భూములు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దాదాపు 50 ఏళ్లుగా జిల్లాలో మెట్ట ప్రాంతంలోని 8 మండలాల్లో రైతులు సుమారు లక్ష ఎకరాల్లో పొగాకు పండించే వారు. గత రెండు సంవత్సరాల నుంచి మార్కెట్‌ సంక్షో¿¶ ంలో ఉండడం, కేంద్ర ప్రభుత్వం పంటపై నిబంధనలు వి«ధించి సాగు విస్తీర్ణాన్ని తగ్గించడంతో రైతులు పొగాకు పంటను తగ్గించారు. 
40 మిలియన్‌ కిలోలకు అనుమతి 
జిల్లాలో 2014 వరకు 60 నుంచి 62 మిలియన్‌ కిలోల ఉత్పత్తి జరిగే పొగాకును గత ఏడాది కేంద్ర ప్రభుత్వం 35 మిలియన్‌ కిలోలకు తగ్గించింది. బ్యారన్‌కు 2.5 ఎకరాల విస్తీర్ణంలో పండించడానికి అనుమతి ఇచ్చారు. అయితే రైతులు సుమారు 40 మిలియన్‌ కిలోల పొగాకు పండించారు. ఈ ఏడాది బ్యారన్‌కు 3.5 ఎకరాల విస్తీర్ణం రిజిస్ట్రేషన్‌ చేసి 40 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చారు. గతేడాది బ్యార్‌కు 25 కింటాళ్లు పండించి అమ్ముకోవడానికి బోర్డు అనుమతి ఇవ్వగా ఈ ఏడాది 30 క్వింటాళ్లకు పెంచారు.  జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 13,925 బ్యారన్‌లు ఉండగా సుమారు 49,000 ఎకరాల్లో పంటకు అనుమతి ఇచ్చారు. సుమారు 12,000 మంది రైతులు పొగాకు పంటను సాగు చేస్తున్నారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో 2276 బ్యారన్లు, గోపాలపురం వేలం కేంద్రం పరి«ధిలో 2380 బ్యారన్లు, కొయ్యలగూడెం వేలం కేంద్రం పరిధిలో 2941 బ్యారన్లు, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రం పరిధిలో 3154 బ్యారన్లు, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రం పరిధిలో 3174 బ్యారన్లు ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు జరిగాయి. 
 
నారుకు గిరాకీ
పొగాకు నారుకు మంచి గిరాకీ ఏర్పడింది. జిల్లాలో సుమారు 1200 ఎకరాల్లో పొగాకు నారుమడులు వేశారు. ఎల్‌.వి–7, ఎన్‌ఎల్‌ఎస్‌–4 వంగడాలను ఎక్కువగా నారు వేశారు. పెద్ద రైతులు ట్రేలలో నారు పెంచి నాటడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు నారును మడి నుంచి తీసి ట్రేలలో రీసెట్టింగ్‌ చేస్తున్నారు. రీసెట్టింగ్‌ నారు ఎకరం నారు రూ.1500 ధర పలుకుంది. రీసెట్టింగ్‌ నారుకు డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో నారుమడులు కట్టిన రైతులు లాభాలు పొందుతున్నారు. ట్రేలలో పెంచిన నారు ఎకరం (6,500 మొక్కలు) రూ.6,000 పలుకుతుండగా, మడిలో పెంచిన నారు రూ.3,000 నుంచి 3,500 ధర పలుకుతోంది. ఎకరం విస్తీర్ణంలోని నారుమడులను రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు రైతులు కొనుగోలు చేస్తున్నారు. దేవరపల్లి, పల్లంట్ల, బందపురం, లక్ష్మీపురం, యర్నగూడెం, సంగాయిగూడెం, చిన్నాయగూడెం గ్రామాల్లో నారుమడులు ఉన్నాయి.  
 
అనుమతికి మించి పంట వేయవద్దు
బోర్డు అనుమతించిన విస్తీర్ణంలో మాత్రమే రైతులు పంట సాగు చేయాలి. గతేడాది కంటే ఈ ఏడాది బోర్డు ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రాంతంలో 5 మిలియన్‌ కిలోల పొగాకు అదనంగా పండించడానికి అనుమతి ఇచ్చింది. బ్యారన్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం జరిగింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించడానికి రైతులు కృషిచేయాలి.  
– వైవీ ప్రసాద్, 
వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి
 
మరిన్ని వార్తలు