ఎంతమంది హరీశ్‌రావులు వచ్చినా...

9 Apr, 2016 20:18 IST|Sakshi

సంగారెడ్డి : తాను టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. శనివారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లను ముందుగా టీఆర్‌ఎస్‌లోకి పంపించి తర్వాత తాను టీఆర్‌ఎస్‌లో చేరతాననే ప్రచారం జరుగుతోందని... అయితే ఇది అబద్ధమన్నారు. పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి పెద్ద తప్పు చేశానని, తిరిగి అలాంటి తప్పు చేయబోనని తెలిపారు.

టీఆర్‌ఎస్‌లోకి కేవలం చప్రాసుల వంటి వాళ్లే వెళ్తారని ఆరోపించారు. అటువంటి వారినే ఆ పార్టీలోకి తీసుకుంటారని విమర్శించారు. తనలాగా ముందుండి పనిచేసే వారిని  ఆపార్టీ నాయకులు తీసుకోరన్నారు. మంత్రి హరీశ్‌రావు కేవలం సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ను బలపర్చుకోవడం కోసమే మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్నారని ఆయన చెప్పారు. . 2019లో జరిగే ఎన్నికల్లో ఎంతమంది హరీశ్‌రావులు వచ్చినా సంగారెడ్డితో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు