విజయవాడ కల్చరల్ : మహానటుడు కొంగర జగ్గయ్య నటన భావినటులకు ఆదర్శమని న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా వివరించారు. మహానటి సావిత్రి కళాపీఠం గాంధీనగర్లోని సంస్థ కార్యాలయంలో జగ్గయ్య 90వ జయంతి శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వేముల మాట్లాడుతూ జగ్గయ్య నటనతో పాటు గొప్ప సాహితీవేత్తగా ఎదిగారన్నారు. విశ్వకవి రవ్రీందుని గీతాంజలి గీతాన్ని తెలుగులోకి అనువందించారని తెలిపారు. కళాపీఠం వ్యవస్థాపకురాలు పరచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్నార్, సమకాలీన నటుడిగా తెలుగు సినిమా చరిత్రలో మరపురాని చిత్రాల్లో నటించారని వివరించారు. దేశభక్తిని చాటుతూ నిర్మించిన ముందడుగు చిత్రం జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టిందని వివరించారు. సావిత్రి కళాపీఠం గౌరవాధ్యక్షుడు ప్రభల శ్రీనివాస్ మాట్లాడుతూ జగ్గయ్య చాలాకాలం ఆకాశవాణి కేంద్రంగా వార్తలు వినిపించేవారన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దూపాటి శ్రీదేవి, పైడిపాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో జగ్గయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.