బెల్లం వ్యాపారి విడుదల

9 Sep, 2016 00:43 IST|Sakshi
  • మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ప్రత్యక్షం
  • కిడ్నాపర్‌ సూడో నక్సలైట్‌ 
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు 
హసన్‌పర్తి : హసన్‌పర్తి సమీపంలో బుధవారం కిడ్నాప్‌నకు గురైన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన బెల్లం వ్యాపారి గురువారు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విడుదలయ్యాడు. వరంగల్‌లోని మట్టెడవాడ పోలీస్‌స్టేçÙన్‌ వద్ద ఆ వ్యాపారి ప్రత్యక్షమయ్యాడు. కిడ్నాపర్‌ సూడో నక్సలైట్‌. ఇటీవల ఓ హత్యకేసులో జైలుకు వెళ్లి గత నెలలో విడుదలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి... పరకాల మండలం నడికుడ గ్రామానికి చెందిన రేనుకుంట్ల బిక్షపతిది నేరచరిత్ర. అతనిపై వివిధ పోలీస్‌స్టేçÙన్లలో కేసులు ఉన్నా యి. ఇటీవల ఆత్మకూర్‌ పోలీస్‌స్టేçÙన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. 
గుమస్తాతో పరిచయం...
నిమాజాబాద్‌ జిల్లా బిక్కనూర్‌కు చెందిన బెల్లం వ్యాపారి శ్యామల భరత్‌ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డికి బిక్షపతితో వరంగల్‌ జైలులో పరిచయం అయ్యాడు. వీరిద్దరూ ఒకే గ్యారేజ్‌లో ఉండడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.  
బెల్లం వ్యాపారం చేస్తానని నమ్మించి..
కాగా, తన వద్ద రూ.3 లక్షలు ఉన్నాయని, తాను కూడా బెల్లం వ్యాపారం చేస్తానని రవీందర్‌రెడ్డిని బిక్షపతి నమ్మించాడు. ఆగస్టు 2న రవీందర్‌రెడ్డి జైలు నుంచి విడుదల కాగా, బిక్షపతి అతడి సెల్‌ నెంబర్‌ తీసుకున్నాడు. అదే నెల 8న బిక్షపతి కూడా జైలు నుంచి బయటికి వచ్చాడు. నాలుగు రోజుల తర్వాత రవీందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి, బెల్లం వ్యాపారం కోసం నిమాజాబాద్‌కు వెళ్లాడు. అక్కడ శ్యామల భరత్‌తో వ్యాపార వ్యవహారాలు మాట్లాడాడు. తనకు మూడు లారీల బెల్లం అవసరమని, ఒక్కో లారీ వరంగల్‌కు చేర్చడానికి రూ.3 లక్షల చొప్పున ఇస్తామని  ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
డబ్బు కోసం రమ్మని కబురు...
రెండు రోజుల క్రితం శ్యామల భరత్‌కు బిక్షపతి ఫోన్‌చేసి డబ్బుల కోసం వరంగల్‌ రమ్మని చె ప్పాడు. దీంతో బుధవారం భరత్‌ తన గుమస్తా రవీందర్‌రెడ్డితో కలిసి వరంగల్‌ వస్తూ.. హసన్‌çపర్తిలో ఆగి బిక్షపతికి ఫోన్‌ చేశారు.
కొత్తవాడలో నిర్భంధం...
కాగా, సమీపంలోనే పెద్ద వ్యాపారులు ఉన్నారని, అక్కడికి వస్తే డబ్బులు ఇస్తారని నమ్మిం చిన బిక్షపతి భరత్‌ను ద్విచక్రవాహనంపై హసన్‌పర్తి నుంచి తీసుకెళ్లాడు. మధ్యలో కిట్స్‌ క్రాస్‌ వద్ద ఆటోలో ఎక్కించుకుని వరంగల్‌లోని కొత్తవాడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో నిర్బం ధించి నాలుగు గంటల పాటు చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. ఆ తర్వాత రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపుతానని అతడి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి బెదిరించాడు. ఈ వ్యవహారంలో బిక్షపతితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.  
అర్ధరాత్రి కుటుంబ సభ్యులను 
అదుపులోకి తీసుకున్న పోలీసులు...
ఎంత ప్రయత్నించినా బిక్షపతి పోలీసుల లైన్‌కు రాలేదు. దీంతో అర్ధరాత్రి  బిక్షపతి ఇంటిపై దాడి చేసి వారి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. చివరికి పోలీసుల హెచ్చరికలతో భరత్‌ను మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో వదిలిపెట్టి వెళ్లినట్లు తెలిసింది. 
నిందితుడి కోసం గాలింపు...
కాగా, బిక్షపతి కోసం పోలీసులు గాలింపు చర్య లు చేపట్టారు. గురువారం రాత్రి వరకు కూడా అతని కోసం ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బిక్షపతి కుటుంబసభ్యులు ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. భరత్‌తో పాటు గుమస్తా, కారుడ్రైవర్‌ కూడా పోలీసుల ఆధీనంలోనే ఉన్నారని సమాచారం. 

 

మరిన్ని వార్తలు