గుంటూరు ఈస్ట్: అస్పృశ్యత, అసమానతలు ఉన్నంత కాలం జాషువా రచనలు వాటిని చెండాడుతూనే ఉంటాయని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ చెప్పారు. అమరావతి రోడ్డులోని అన్నదాన సమాజంలో మహాకవి జాషువా కళాపీఠం సారథ్యాన నిర్వహిస్తున్న సాహితీ చర్చ నాలుగో రోజు ఆదివారం కూడా కొనసాగింది. కొలకలూరి ఇనాక్ అధ్యక్షతన జరిగిన సభలో పెనుగొండ మాట్లాడుతూ జాషువా సాహిత్య ఉద్యమం పోరాట బావుటాను తర్వాతి తరం ముందుకు తీసుకువెళ్లేందుకు అభ్యుదయ కవులకు అవకాశం లభించిందన్నారు. కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ అసమానతలు లేని రేపటి సమాజంలో జాషువా కవిత్వం ప్రధాన భూమిక వహిస్తుందన్నారు.