హమ్మయ్య.. క్షేమంగా చేరాం..!

30 Aug, 2016 21:19 IST|Sakshi
  • టేకాఫ్‌లో ఊగిసలాడిన విమానం
  • ఆందోళనకు గురైన ప్రయాణికులు
  • మధురపూడి :
    హైదరాబాద్‌లో బయలుదేరిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం టేకాఫ్‌ సమయంలో ఊగిసలాడడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైనట్టు తెలిసింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఇది బయలుదేరింది. ఈ సర్వీసులో 68 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్‌ తీసుకున్నప్పుడు ఒక్కసారిగా పక్కగా ఊగిసలాడిందని, దీంతో తామంతా ఆందోళనకు గురయ్యామని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన సూర్యనారాయణమూర్తి తెలిపారు. సుమారు 11 గంటల సమయంలో రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఇక్కడకు చేరుకున్న ప్రయాణికులు తమ బంధువులకు ఈ విషయాన్ని తెలియజేశారు. తమవారు సురక్షితంగా చేరడంతో వారి బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. వర్షాకాలం కావడంతో పెద్ద పక్షులు రన్‌వే ప్రాంతంలో చేరుతున్నాయి. దీనివల్ల విమానాల రాకపోకలకు అంతరాయం తలెత్తుతోంది. ఇటీవల ఓ కొంగ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాన్ని ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది.
     
మరిన్ని వార్తలు