‘బైపాస్’ పేరుతో రైతుల పొట్టకొట్టొద్దు

20 Jul, 2016 03:39 IST|Sakshi
‘బైపాస్’ పేరుతో రైతుల పొట్టకొట్టొద్దు

 తుర్కపల్లి :  బైపాస్‌రోడ్డు పేరుతో రైతుల పొట్టకొట్టొద్దని జాతీయ కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బైపాస్ రోడ్డు వెంటనే నాలుగు లేన్ల రోడ్డు విస్తరించాలని తెలంగాణ పరిరక్షణ సమితి ఆధ్యర్యంలో  మంగళవారం మండలంలోని జేఎం ఫంక్షన్‌హాలులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్న ప్రభుత్వం ఉన్న భూములు ఆక్రమించుకున్న ప్రజాప్రతినిధులకు, రియల్టర్లకు వత్తాసు పలుకుతుందన్నారు. యాదాద్రి నుంచి కీసర వరకు ప్రభుత్వం తలపెట్టిన బైపాస్ రోడ్డులో 350 ఎకరాల వరకు రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
 
  ప్రస్తుతం ఉన్న రోడ్డు అన్నింటికి అనువుగా ఉండి, ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు రైతులు భూములు ఆక్రమించుకొని రోడ్డు వేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి సరాసరి యాదాద్రికి వెళ్లడానికే రోడ్డు వేసుకొని ఇటు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధుల జేబులు నింపడానికి జరుగుతున్న ప్రయత్నమేనన్నారు. 2013 చట్టం ప్రకారం  రైతులకు మార్కెట్ రేట్‌కు నాలుగింతల పరి హారం అందజేయాలన్నారు.  బైపాస్ రోడ్డు విషయంలో ఎటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా అమాయక రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 
 తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెండాలు పక్కన పెట్టి భూనిర్వాసితుల ఎజెండానే ముందుకు తీసుకొని పోరాటం చేయాలని అన్నారు. అనంతరం భూనిర్వాసితులు కమిటీని ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా కొక్కొండ లింగయ్య, గౌరవసలహాదారుగా కల్లూరి రామచంద్రారెడ్డి, బబ్బూరి రవీంధ్రనాథ్‌గౌడ్ , 20 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో  ముల్కలపల్లి రాములు, కొండమడుగు నర్సింహ, బండ శ్రీశైలం, మటూరి బాల్‌రాజు, మాటూరి బాల్‌రాజు, మంగ నర్సింహులు, నాయకులు రంగ శంకరయ్య, బబ్బూరి పోశెట్టి, ఎలుగల రాజయ్య, పిడుగు అయిలయ్య, దుర్గయ్య,   నర్సింహులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు