నల్లగొండ నుంచే సమర శంఖారావం

6 Oct, 2016 04:22 IST|Sakshi
నల్లగొండ నుంచే సమర శంఖారావం

• బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్

నల్లగొండ టూ టౌన్: కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని వారి సమస్యలపై నల్లగొండ నుంచే బీజేపీ సమర శంఖారావం పూరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రైతు ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు.
 
లక్ష రూపాయల్లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే 4 దఫాలుగా చేస్తామని మాటమార్చారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల రీడిజైనింగ్ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే అని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారన్నారు. బతుకమ్మ పేరున కూతురు ప్రచారానికి సీఎం కోట్లు ఖర్చు పెడుతున్నారే తప్ప రైతాంగం కోసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టడానికి కూడా చేతులు రావడం లేదన్నారు.

మరిన్ని వార్తలు